తెలంగాణ ఆయిల్ పామ్ రైతులకు కేంద్రం గుడ్న్యూస్
తెలంగాణ రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు ముడి పామాయిల్ దిగుమతిపై 5.5 నుంచి 27.5 పన్ను శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ పామాయిల్ రైతుల తరపున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ఆయిల్ పామ్ గెలల ధర తగ్గాయని, దీంతో రైతులు నిరాశ చెందారని చెప్పారు. ఇక కొత్తగా పంట సాగు చేయాలనుకున్న రైతులపై పూడా ఇది ప్రతికూల ప్రభావం చూపిందని తుమ్మల తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులకు అధిక ధర అందించి రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు లాభసాటిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

కొత్త ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముడి పామాయిల్ పై దిగుమతి సుంకం తిరిగి విధించి దేశీయ పామాయిల్ రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అంతేగాక, ఇటీవల తెలంగాణకు విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి తుమ్మలతోపాటు ఆయిల్ పామ్ రైతులు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13న ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం 5.5 నుంచి 27.5 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గెలల ధర రూ. 1500 నుంచి రూ. 1700 వరకు పెరిగితే టన్ను రూ. 16,500 దాటే అవకాశం ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,400 ఎకరాల్లో పామాయిల్ తోటల నుంచి 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి వస్తుందన్నారు.
ఈ దిగుమతి సుంకం పెంపుతో 9366 మంది ఆయిల్ పామ్ రైతులకు అదనంగా లబ్ధి చేకూరనుందని వివరించారు. పామాయిల్ దిగుమతిపై కేంద్రానికి ఏడాదికి రూ. 80 వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుందన్నారు. అయితే, దిగుమతి సుంకాలు విధించడంతో దేశం, తెలంగాణలోని పామాయిల్ రైతులు లాభపడతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.












Click it and Unblock the Notifications