బెడిసిన సీట్ల సర్దుబాటు: పటాన్చెరులో బిజెపి, టిడిపి పొత్తు చిత్తు
హైదరాబాద్: పటాన్చెరు డివిజన్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బిజెపి అభ్యర్తితో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్తి కూడా బరిలో నిలిచారు. సీట్ల సర్దుబాటులో భాగంగా పటాన్చెరును తమకు కేటాయించారని టిడిపి తన అభ్యర్తిని ఖరారు చేసింది. అయితే బిజెపి నాయకులు తమకే పటాన్చెరు సీటును కేటాయించాలని రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
పొత్తుల్లో భాగంగా పటాన్చెరును టిడిపి కేటాయిచండంపై బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. టికెట్పై ఆశలు పెట్టుకున్న బిజెపి నాయకుడు దేవేందర్రాజు దాదాపుగా ఆశలు వదులుకున్నారు. గెలిచే అవకాశం ఉన్న సీటును మిత్రపక్షానికి వదులుకోవడం ఏమిటని అధిష్ఠానాన్ని వారు ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
బీ-ఫారాలు ఇవ్వకుండా రెండు పార్టీల అధిష్ఠానాలు అభ్యర్థులతో దోబూచులాడటంతో పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగింది. బిజెపి నాయకులంతా ఒక్కటై పటాన్చెరుపై తీవ్రంగా పట్టుబట్టారు. టిడిపి నాయకులతో బీజేపీ రాష్ట్ర నాయకులు చర్చిలు జరిపినా వారు పటాన్చెరును వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
అయితే, బుధవారం రాత్రి నుంచి అనూహ్యంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ రాష్ట్ర కోశాధికారి మనోహర్రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డిలు పార్టీ బీ-ఫారంతో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నామినేషన్ల కేంద్రం వద్ద ప్రత్యక్షమయ్యారు. ఆ సమాచారం అందుకున్న దేవేందర్రాజు ఉరుకులు పరుగులతో నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లి కార్యాలయంలో అధికారులకు బీ-ఫారాన్ని అందజేశారు.
కనీసం పొత్తుల్లో బీజేపీకి పటాన్చెరును కేటాయించకున్నా తమ పార్టీ అభ్యర్థికి బీ-ఫారం అందడంతో బిజెపి స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు.