దయాకర్ రెడ్డి పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు..!!
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నిశాళి అర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఆయన స్వగ్రామం పర్కాపురంలో మంగళవారం దయాకర్ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు కొంత దూరం పాడె మోసారు. దయాకర్ రెడ్డి రాష్ట్ర విభజనకు ముందు మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసారు. ఎన్టీఆర్, చంద్రబాబుకు దయాకర్ రెడ్డి సన్నిహితుడుగా పేరు పొందారు.
నారాయణపేట జిల్ల మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి క్యాన్సర్ వ్యాధితో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. ఆయన మరణం విషయం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు పర్కాపురం వెళ్లి దయాకర్ రెడ్డి పార్దివ దేహానికి నివాళి అర్పించారు. పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. దయాకర్ రెడ్డి మూడుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నుంచి 1994, 1999 లో మక్తల్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక నిర్ణయాల్లో ప్రధాన భూమిక పోషించారు.

దయాకర్ రెడ్డి సతీమణి సీతాదయాకర్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా పని చేసారు. దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగానూ వ్యవహరించారు. తొలి నుంచి చంద్రబాబుతో దయాకర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కొంత కాలంగా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు చేసారు. అనారోగ్య కారణాలతో క్రియాశీలక రాజకీయాలకు కొంత కాలంగా దయాకర్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. దయాకర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.












Click it and Unblock the Notifications