టీడిపి వద్దు..! టీడిపి ఓటు బ్యాంకు ముద్దు..! అదే టీఆర్ఎస్ జిద్దు..!
హైదరాబాద్ : తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు విచిత్రంగా మారింది. అన్ని పార్టీలతో పాటు అదికార గులాబీ పార్టీ కి కూడా తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో తెలిసొస్తోంది. తెలంగాణ లో తెలుగుదేశానికి ఉన్న ఓటు బ్యాంకు చూసి అన్ని పార్టీలు ఆశ్యర్యపోతున్నట్టే అదికార పార్టీ కూడా నెవ్వరపోతోంది. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుని తమకు అనుకూలంగా మలుచుకోవాలని అదికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి, తెలుగుదేశాన్ని మాత్రం నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోంది. ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల తెలుగుదేశం పార్టీ పైన ఘాటుగా విమర్శలు చేస్తూనే స్వర్గీయ ఎంటీఆర్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేసారు.
తెలంగాణలో అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నద్దం..! అందరి చూపి టీడిపి పైనే..!!
టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ముందస్తు వ్యూహాన్ని ఎంచుకుని మిగతా పార్టీలకు సవాల్ విసిరారు కేసీఆర్. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ స్పీడు పెంచేశాయి. అసెంబ్లీని రద్దు చేసిన రోజే ఊహించని స్థాయిలో టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో మిగతా పార్టీలు కూడా అదే పనిలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థుల ఖరారులో తల మునకలై ఉన్నాయి అన్ని పార్టీలు.
తెలంగాణలో అన్ని పార్టీలతో పాటు అదికార పార్టీకి కూడా టీడిపి కనిపించడం విశేషం..!
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా క్రెడిట్ సాధించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. దీంతో ఈ సారి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొందరు కీలక నేతలు పార్టీకి దూరమైనా, ఇతర పార్టీల నుంచి కొందరు నేతలను తమ పార్టీలోకి రప్పించుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోంది. అయితే, ఒంటరిగా వెళ్తే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదని గ్రహించిన ఆ పార్టీ, ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు తెరపైకి వచ్చింది.
ఓట్ల కోసం ఎంటీఆర్ ను పొగడాలి..! రాజకీయం కోసం నేతలను దూరం పెట్టాలి..! ఇదే కేటీఆర్ చతురత..!
ఇక, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పొత్తుపై దాడిని ప్రారంభించింది. మొన్న జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ .తెలంగాణను అడ్డుకున్న రెండు గడ్డాలు (ఉత్తమ్కుమార్రెడ్డి, చంద్రబాబు) ఏకమవుతున్నాయని. కాంగ్రెస్-తెలుగుదేశం పొత్తుపెట్టుకోవడం తనకు సంతోషం కలిగిస్తోందని, అంతే కాకుండా ఎన్నికల్లో ఈ ఇద్దరినీ వేర్వేరుగా కాకుండా కలిపి కొట్టే అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను బొందపెట్టడానికే నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అటువంటి పార్టీని కాంగ్రెస్ కు తోక పార్టీగా మార్చిన ఘనత మాత్రం చంద్రబాబుకే దక్కుతుంది'' అని ఎద్దేవా చేశారు.
టీడిపి వద్దనుకున్నప్పుడు వారి ఓట్లు మాత్రం ఎందుకని ప్రశ్నిస్తున్న నాయకులు..!
అయితే కల్వకుంట్ల తారక రామారావు వాఖ్యల్లో తెలుగుదేశం పార్టీని ఆంధ్రోళ్ల పార్టీ అంటూ విమర్శించి, దానిని స్థాపించిన ఎన్టీఆర్ను మాత్రం ప్రసంశలతో ముంచెత్తారు. దీనిని బట్టి చూస్తే, ఆయన ఎన్టీఆర్ను వాడుకోవాలని చూస్తున్నారని, తద్వారా టీడీపీకి అనుకూలంగా ఉన్న సెటిలర్ల ఓట్లను లాక్కొవచ్చేనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కేటీఆర్ కామెంట్స్ చూసిన టీడీపీ అభిమానులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. టీడీపీ వద్దు కానీ, ఆ పార్టీకి మద్దతుగా ఉన్నఆంద్ర ప్రజానికం ఓట్లు మాత్రం కావాలా..? అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.