టీడీపీకి సీనియర్ నేతల గుడ్ బై - కన్నీటి పర్యంతం..!!
ఎలాగైనా పార్టీని తిరిగి రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్లు పార్టీ వీడుతున్నారు. టీడీపీకి గతంలో బలమైన జిల్లాగా ఉన్న ఉమ్మడి పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో కీలక నేతలు పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్రెడ్డి, సీతా దయాకర్రెడ్డి దంపతులు పార్టీకి దూరమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో కొత్తకోట దంపతులు కీలకపాత్ర పోషించారు.
టీడీపీ రాజకీయాల్లో కీలకంగా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో వీరే కీలకంగా ఉన్నారు. అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు పర్యాయాలు దయాకర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 20019లో నియోజకవర్గాల పునర్విభజనతో దయాకర్ రెడ్డి 2009లో మక్తల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాదించారు. కాగా, సీతా దయాకర్ రెడ్డి 2002లోనే జెడ్పీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.
2009లో దేవరకద్ర నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశంలో కీలక నేతలుగా వ్యవహరించిన ఈ దంపతులు ఇద్దరూ.. రాష్ట్ర విభజన తరువాత రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణాలు.. టీడీపీ బలహీనపడటం.. పూర్తిగా పార్టీ అధినేత ఏపీ పైనే ఫోకస్ పెట్టటంతో..వీరిద్దరూ కూడా రాజకీయంగా మౌనంగా ఉండిపోయారు.
కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం
అయితే, ఇప్పుడు తిరిగి తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ..టీడీపీ వీడి.. రాజకీయంగా మరో పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత సొంత జిల్లాకు చెందిన వారు కావటంతో పాటుగా.. వ్యక్తిగతంగా ఉన్న సంబంధాలతో వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఇదే జిల్లాకు చెందిన వారు. టీడీపీకి ఒక సమయంలో కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ఇప్పుడు ఒకరిద్దరు నేతలే కనిపిస్తున్నారు. దయాకర్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవరకద్రలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన ఆయన అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
జన్మదినం నాడు రాజీనామా ప్రకటన
ఆ సమయంలో తన రాజకీయం నిర్ణయాన్ని దయాకర్ రెడ్డి వారితో పంచుకున్నారు తాను మూడు దశాబ్దాలకు పైగా టీడీపీలో నాడు ఎన్టీఆర్..ఆ తరువాత చంద్రబాబుతో కలిసి పని చేసిన సందర్బాలను..వారితో సంబంధాలను గుర్తు చేుసుకున్నారు. కానీ, పార్టీ నుంచి నమ్ముకున్న కార్యకర్తలకు - ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. దీని కారణంగానే రాజకీయంగా నిర్ణయం తీసుకుంటున్నామని.. పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ ఇద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఖాయమని తెలుస్తోంది.