కరోనా మందు అందుకుంటున్న తొలి 5 రాష్ట్రాల్లో తెలంగాణ: రెండో విడత విజయవాడకు
న్యూఢిల్లీ/హైదరాబాద్: కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించనున్న ఔషధం 'కొవిఫర్'ను తొలి విడతగా ఐదు రాష్ట్రాల్లో అందజేశారు. వీటిలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉండటం గమనార్హం. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడుతోపాటు తెలంగాణ రాష్ట్రాలకు ఈ ఔషధాన్ని పంపారు.

రెండో విడతలో విజయవాడకు హెటిరో కరోనా మందు..
ఆ తర్వాత బ్యాచ్ కరోనా ఔషధాన్ని కోల్కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చి, తిరువనంతపురం, గోవాకు సరఫరా చేయనున్నట్లు సమాచారం. కాగా, అమెరికాకు చెందిన గిలిచ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన రెమ్డెసివర్ అనే మందును తయారు చేసింది. అయితే, దీనికి జనరిక్ తయారు చేసి, పంపిణీ చేసేందుకు హైదరాబాద్ కు చెందిన హెటిరో ల్యాబ్స్ కు అనుమతి లభించింది.

తొలి విడతగా 20వేల వయల్స్.. 100ఎంజీకి రూ. 5400
ఈ క్రమంలో హెటిరో తొలి విడతగా 20వేల వయల్స్ను ఆయా రాష్ట్రాలకు అందజేసింది. మరో రెండు మూడు వారాల్లో లక్ష వయల్స్ తయారు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, కొవిఫర్ పంపిణీ ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారా మాత్రమే జరుగుతుందని, మార్కెట్లో కొనుగోలు చేసేందుకు లభించదని హెటిరో స్పష్టం చేసింది. అత్యవసర స్థితిలో ఉన్న కరోనావైరస్ బాధితుల చికిత్సలో మాత్రమే కొవిఫర్ను వాడనున్నారని హెటిరో సంస్థ తెలిపింది. ఒక్కో కరోనా రోగికి కనీసం ఆరు మోతాదులు అవసరమని, 100 మిల్లిగ్రాముల మోతాదు రూ. 5400 అని వెల్లడించింది.

బరిలో సిప్లా కూడా.. రూ. 5వేల లోపే..
మరోవైపు ఇదే జనరిక్ మందును తాము కూడా తయారు చేస్తున్నామని అమెరికా ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న సిప్లా ఫార్మా తెలిపింది. ఇంజెక్షన్ ధర మాత్రం రూ. 5వేల లోపే ఉంటుందని ఈ సంస్థ ప్రకటించింది. కాగా, క్లినికల్ ట్రయల్స్ తోపాటు అత్యవసర కరోనా రోగులకు ఈ ఇంజక్షన్ ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలిపింది. ఈ యాంటీ వైరల్ మందు కరోనాను నియంత్రిస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. అమెరికా, దక్షిణ కొరియా దీనిని పాక్షికంగా అనుమతించగా, జపాన్ మాత్రం పూర్తి ఆమోదం తెలిపింది.
Recommended Video

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐదు రాష్ట్రాల్లోనే 80శాతం
కరోనా బారిన పడిన దేశాల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్లో ఇప్పటికే సుమారు 4.74 లక్షల కేసులు, 14,914 మరణాలు నమోదయ్యాయి. కాగా, మొత్తం కేసుల్లో 80 శాతం మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications