కేంద్రం గ్రీన్ సిగ్నల్: అదే పనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఖర్చులపై లెక్కలు
హైదరాబాద్/అమరావతి: ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు తమ సొంత స్థలాలకు వెళ్లవచ్చంటూ కేంద్రం అనుమతించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు మార్గదర్శకాలను రూపొందించాయి. లాక్డౌన్ విధించి 36 రోజుల గడిచిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు సడలింపులు కల్పించిన విషయం తెలిసిందే.

కేంద్రం అనుమతివ్వడంతో..
ఇతర రాష్ట్రాల్లోని వలసకార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను తమ సొంత రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కరోనా సోకని వలసకార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వారిని తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆదేశాలుజారీ చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఇప్పటికే దీనిపై మార్గదర్శకాలను రూపొందించాయి. ఇప్పుడు దక్షణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అదే పనిలో పడ్డాయి.

తెలంగాణ సర్కారు చర్యలు ముమ్మరం
తెలంగాణకు చెందిన ఎంత మంది ప్రజలు ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయారో తమకు సమాచారం అందించాలని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖలు రాసింది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణలో చిక్కుకుపోయిన వారిని తమ రాష్ట్రానికి పంపించే ఏర్పాట్లు చేయాలని కోరాయి. ఏర్పాట్లు, ఖర్చులపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మొదట కరోనా పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత నెగెటివ్ అని తేలితే వారిని వారి ఇంటికి పంపించేస్తారు. లేదంటే ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు.

సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ సర్కారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తమ వారి కోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇక్కడ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే తమ ఇళ్లకు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లోంచి వచ్చే వారికోసం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఖర్చులపై లెక్కలు వేస్తోంది. ఇప్పటికే గుజరాత్, తమిళనాడు నుంచి పలువురిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

8కోట్ల అంచనాతో కర్ణాటక..
ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికులను తిరిగి తీసుకొచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వారి కోసం బస్సులను ఏర్పాటు చేసింది. 25 మందిని తీసుకురావడానికి రోజుకు రూ. 10వేలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఒక లక్ష మందిని తీసుకురావడానికి 4వేల బస్సులు, రూ. 4 కోట్ల అవసరమవుతాయని తెలిపింది. అధికారిక లెక్కల ప్రకారం కర్ణాటక నుంచి సుమారు 2 లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో ఉండటంతో వారందర్నీ తీసుకు రావడానికి సుమారు 8 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనావేసింది.












Click it and Unblock the Notifications