బీఆర్ఎస్ పై అక్కడే తొలి విజయం - "హస్త"గతం అయ్యేనా..!?
తెలంగాణ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. సీఎం కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా మార్చిన తరువాత ఎదుర్కొంటున్న ఎన్నికలు. ఇక్కడ గెలిస్తేనే జాతీయ స్థాయిలో గుర్తింపు. కానీ, ఇక్కడే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కర్ణాటక తరువాత తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది. అసలు ఊసే లేదనే స్థాయి నుంచి కాంగ్రెస్ గెలవాలనేది పబ్లిక్ మూడ్ గా చెప్పుకొనే విధంగా ఎదిగింది. అక్కడే బీఆర్ఎస్ పై తొలి విజయం సాధించింది. ఇప్పుడు అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఎన్నికల రాజకీయం: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.కాంగ్రెస్ గెలుపుపై ఆశలు చిగురుస్తున్నాయి. తిరుగు లేదని భావించిన బీఆర్ఎస్ ఇప్పుడు తుది వ్యూహాలకు పదును పెడుతోంది. పదేళ్ల తరువాత బీఆర్ఎస్ పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకుంటూ ముందుకు వెళ్తోంది. బీజేపీ బలహీనపడిన వేళ వేగంగా పావులు కదిపింది.

గతంలో కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు వలసలు ఏ విధంగా ప్రోత్సహించిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే రివర్స్ గేమ్ మొదలు పెట్టింది. బీజేపీ కోలుకోకుండా చేసింది. ఇక..కర్ణాటకలో కలిసి వచ్చిన పేదలకు కావాల్సిన పథకాలతో ముందుగానే ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తరువాత కేసీఆర్ తన మేనిఫెస్టోలో వాటినే అనుసరిస్తూ..కొంత మెరుగ్గా ఇస్తానని చెప్పినా..అవన్నీ కాంగ్రెస్ హామీల కాపీగానే ప్రచారం మొదలైంది.
కాంగ్రెస్ కొత్త వ్యూహాలు: తెలంగాణలో బీఆర్ఎస్ పైన వ్యతిరేకంగా ఉన్న వర్గాలను గుర్తించిన కాంగ్రెస్ పూర్తిగా వారిని తమ వైపు తిప్పుకోవటం పైనే ఫోకస్ చేసింది. తెలంగాణలో పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఎన్నికల వేళ సమస్యగా మారకుండా ఏడాది కాలంగా పార్టీ హైకమాండ్ ముఖ్యులే నేరుగా తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. టికెట్ల ఖరారులోనూ ఎటువంటి సమస్యలు లేకుండా ఖరారు చేయటంలో సక్సెస్ అయ్యారు.
రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి నేతలు తెలంగాణలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. హామీల అమలు తమ బాధ్యతగా ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ నేతలంతా ఏకతాటి పైన ఉన్నారనే అభిప్రాయం కలిగించటంలో సక్సెస్ అయ్యారు. దక్షిణాదిన తెలంగాణలోనూ గెలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ తో పాటుగా బీజేపీకి స్థానం లేకుండా చేయాలనేది కాంగ్రెస్ టార్గెట్ గా ఉంది.

కలిసొస్తున్న లెక్కలు: 2018లో వచ్చిన ఓట్ల చీలిక ఈ సారి లేకుండా జాగ్రత్త పడుతోంది. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయినట్లుగానే కనిపిస్తోంది. బీఆర్ఎస్ కంచుకోటల పైన ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. బీఆర్ఎస్ ను ఓడించాలంటే ఏ వర్గాలను తమ వైపు తిప్పుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజానాడి ఉందనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది.
అదే ఇప్పుడు బీఆర్ఎస్ కు సమస్యగా మారుతోంది. కాంగ్రెస్ కు పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీ అనుకూలంగా ఉండటంతో బీఆర్ఎస్ నేతల ధీమా..విశ్వాసం గురించి ప్రజల్లో చర్చ లేదు. కేసీఆర్ ను ఓడించాలా..గెలిపించాలా అనే అంశం పైనే ఇప్పుడు చర్చ కనిపిస్తోంది. కాంగ్రెస్ గురించి తెలంగాణ ఏర్పాటు ముందు అంశాలు మినహా..ప్రజల్లో ఆ పార్టీ వద్దని చెప్పటానికి బీఆర్ఎస్ దగ్గరా సరైన అస్త్రాలు కనిపించటం లేదు. మరి..ఎన్నికల వరకు కాంగ్రస్ ఈ జోష్ కొనసాగిస్తుందా..అధికారం హస్తగతం చేసుకుంటుందా అనేది వచ్చే నెల 3న తేలనుంది.












Click it and Unblock the Notifications