కేసీఆర్ ప్రభుత్వంపై సుష్మా స్వరాజ్ ఆగ్రహం, మాకు ఎవరితోను పొత్తులేదని మాయావతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం చెప్పారు. హైదరాబాదులోని మాధాపూర్లో ఆమె మీడియాతో మాట్లాడారు.
బీజేపీ గెలిస్తే తప్ప తెలంగాణ నిర్మాణం జరగదన్నారు. పన్నెండు వందల మంది యువత బలిదానం చేసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం 400 మందినే గుర్తించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం యువత చేసిన బలిదానాలను కూడా గుర్తించలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారన్నారు.
వెరీ ఇంట్రెస్టింగ్: కోడలు సుహాసిని నియోజకవర్గంలో పురంధేశ్వరి ప్రచారం
తెలంగాణ సమాజం కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది గానీ, కేసీఆర్ కుటుంబంలోని అయిదుగురు వ్యక్తుల కోసం కాదని చెప్పారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదని, కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.
మాయావతి ప్రచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వంద స్థానాలలో పోటీ చేస్తోందని ఆ పార్టీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. బుధవారం నిర్మల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఇక్కడ ఏ పార్టీతోను బీఎస్పీకి పొత్తు లేదని చెప్పారు.
తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి జరగలేదని చెప్పారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిందని చెప్పారు. కాన్షీరామ్ కన్న కలలు మనం నిజం చేద్దామని పిలుపునిచ్చారు.