పెరుగుతున్న పోలింగ్ శాతం, కలిసొచ్చేదెవరికి - "మూడ్" క్లియర్..!!
తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పోలింగ్ వేగం పుంజుకుంటోంది. అక్కడక్కడా ఈవీఎంల సమస్యలు..పార్టీల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, గతం కంటే పోలింగ్ శాతం పెంచాలని ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. తొలి నాలుగు గంటల్లో నమోదైన పోలింగ్ పరిశీలిస్తే ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుందనే చర్చ మొదలైంది. పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి కలిసి వస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.
పోలింగ్ శాతమే కీలకం: తెలంగాణలో పోలింగ్ ప్రారంభమై నాలుగు గంటలు అవుతోంది. 9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 11 గంటలకు 15 శాతానికి పైగా నమోదైనట్లు సమాచారం. అయితే, పోలింగ్ శాతం ఏమేర నమోదైతే ఎవరు గెలుస్తారనే లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పోలింగ్ శాతం ఫలితం తేల్చేస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి.

దీంతో..తెలంగాణలో ఏ మేర పోలింగ్ జరుగుతుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో 69 శాతం నమోదైతే, 2018 ఎన్నికల్లో 73.7 శాతం నమోదైంది. ఈ సారి గతం కంటే పెరుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వాల పైన వ్యతిరేకత ఉంటే పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. కానీ, 2018 లో ఫలితం భిన్నంగా వచ్చింది.
ఎవరికి కలిసొచ్చేను: మొత్తం 3.26 కోట్ల మంది తెలంగాణలో ఓటర్లుగా ఉన్నారు. ఈ సారి జరుగుతున్న హోరా హోరీ పోరులో ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ప్రధాన పార్టీలకు కీలకంగా మారుతోంది. దీంతో, ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ పైన ఉత్సుకత కనిపిస్తోంది. వయసులో పెద్దవారు..మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు.
వీరిని చూసిన ప్రధాన పార్టీలు తమకే పోలింగ్ అనుకూలంగా ఉందనే అంచనాల్లో ఉన్నారు. పోలింగ్ శాతం భారీగా నమోదైతే ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటింగ్ జరుగుతందనే అభిప్రాయాలు గతంలో ఉండేవి. అదే సమయంలో రాజకీయంగా బలమైన మూడ్ ఏదైనా ప్రభావితం చేస్తే ఆ సమయంలోనూ ఓటర్ టర్నవుట్ భారీగా ఉంటుందనేది మరో అంచనా.
ప్రజల మూడ్ క్లియర్: ఇక, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల పోరాటంలో పార్టీలు నువ్వా,నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. కానీ, ఓటింగ్ శాతం పెరిగినా..తగ్గినా అది ఫలితం పైన ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. దీంతో, తమకు అనుకూలంగా ఉండే అన్ని ఓట్లు పోలయ్యేలా పార్టీలు చివరి నిమిషం వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఇప్పటికే తొలి నాలుగు గంటల్లో జరిగిన పోలంగ్ ట్రెండ్స్ పైన పార్టీల వార్ రూమ్స్ లో విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో, సాయంత్రం 5 గంటల వరకు తమ పట్టు జారకుండా పార్టీలు మైండ్ గేమ్ మొదలు పెట్టాయి. ఇప్పటి వరకు రెండు ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న వార్..తాజా ఓటింగ్ సరళితో మాత్రం ప్రజా తీర్పు ఒక పార్టీకే స్పష్టమైన మెజార్టీ ఇవ్వబోతున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications