బండి సంజయ్ ఖేల్ ఖతం- ఇక తెలంగాణను దున్నేస్తా: రఘునందన్ రావు
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతల్లో అంతర్గత కుమ్ములాటు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎన్నికలకు సమాయాత్తం కావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో కీచులాటలు తీవ్రం అయ్యాయి. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్పై ఘాటు విమర్శలు చేస్తోన్నారు సొంత పార్టీ నాయకులు.
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఈటల రాజేందర్.. ఈ వ్యవహారం మొత్తాన్నీ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. బండి సంజయ్ వైఖరిపై ఫిర్యాదు చేశారు. సొంత నిర్ణయాలతో పార్టీని దిగజార్చాడంటూ మండిపడ్డారు. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేటట్లయితే తాము ఉండబోమనీ తేల్చి చెప్పారు.

ఇక తాజాగా మరో సీనియర్ నేత బండి సంజయ్కి వ్యతిరేకంగా గళం విప్పారు. సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక శాసన సభ్యుడు రఘునందన్ రావు.. ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. బండి సంజయ్ను అధ్యక్ష స్థానం నుంచి తప్పించబోతోన్నారంటూ వస్తోన్న వార్తలన్నీ నిజమేనని తేల్చి చెప్పారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని అన్నారు.
ఇవ్వాళ ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘకాలంగా బీజేపీలో పని చేస్తోన్న తనకు ఇప్పటివరకు సరైన గుర్తింపు రాలేదని రఘునందన్ రావు అన్నారు. తన సేవలను గుర్తించాలని, పార్టీ పగ్గాలను అప్పగించాలని కోరారు. 10 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న తన కంటే సమర్థుడైన నాయకుడు లేడని పేర్కొన్నారు.
పార్టీ అధ్యక్ష పదవి, ప్రతిపక్ష నేత, లేదా జాతీయ అధికార ప్రతినిధి పదవుల్లో ఒక్కటైనా తనకు ఇవ్వాలంటూ పట్టుబట్టారు రఘునందన్ రావు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మునుగోడులో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయామని, దీనికి ప్రధాన కారణం ఎవరో అందరికీ తెలిసిందేనని పరోక్షంగా బండి సంజయ్ను ఉద్దేశించి విమర్శించారు.

అదే 100 కోట్ల రూపాయలు తనకు ఇస్తే తెలంగాణను దున్నేసేవాడినంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో దుబ్బాక ఉప ఎన్నికలో తాను గెలిచానని గుర్తు చేశారు. అధికార బీఆర్ఎస్ అభ్యర్థిని తాను ఓడించానని చెప్పారు. దుబ్బాక ఓటర్లు తనను చూసే బీజేపీకి ఓటు వేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢీ కొట్టే మొగోడినని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని రఘునందన్ రావు అన్నారు.
ఏ దుబ్బాక ఉప ఎన్నికలో తాను గెలిచానో.. అదే దుబ్బాకలో తనకంటే ముందు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి 3,500 ఓట్లే పడ్డాయని వివరించారు. పార్టీని బలోపేతం చేయడానికి 10 సంవత్సరాలుగా అహర్నిశలు కష్టపడుతున్నానని, తన కష్టాన్ని చూసి, గెలిచిన తీరును చూసి ఈటల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యారని అన్నారు.












Click it and Unblock the Notifications