బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బలి: పార్టీ నుంచి సస్పెండ్: ఆ కామెంట్లపై మోడీ సీరియస్: వాట్ నెక్స్ట్?
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అసెంబ్లీలో బీజేపీ సభా పక్షనేతగా వ్యవహరిస్తోన్న ఆయనను ఆ పదవి నుంచి కూడా తప్పించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ చేయడానికి గల కారణాలను కూడా వివరించింది బీజేపీ హైకమాండ్. అలాగే- మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను 10 రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశించింది.

రాజా సింగ్ అరెస్ట్తో పాటు సస్పెండ్..
ఈ ఉదయం రాజా సింగ్ అరెస్టయిన విషయం తెలిసిందే. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ నిర్వహించ తలపెట్టిన ప్రదర్శనకు వ్యతిరేకంగా రాజా సింగ్ తాజాగా మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు 10 నిమిషాల 27 సెకెండ్ల నిడివి ఉన్న ఓ వీడియోను ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పోస్ట్ చేశారు.

ఉద్రిక్త పరిస్థితులు..
ఈ వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజా సింగ్ను అరెస్ట్ చేయాలంటూ ఏఐఎంఐఎం సహా పలువురు ముస్లిం సంఘాల ప్రతినిదులు పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. బషీర్ బాగ్లో గల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు బైఠాయించారు. రాజా సింగ్కు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనితో హైదరాబాద్ నగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

హైకమాండ్ ఆరా..
ఈ పరిణామాలపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. అన్ని వివరాలను అడిగి తెలుసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ సెంట్రల్ డిసిప్లీనరీ కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ ఓ ప్రకటన విడుదల చేశారు.

10 రోజుల్లోగా..
దీనితో పాటు- మహ్మద్ ప్రవక్తపై ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే విషయం మీద సెప్టెంబర్ 2వ తేదీలోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తప్పనిసరిగా 10 రోజుల్లోగా డిసిప్లీనరీ కమిటీకి అందజేయాలని అన్నారు.

ఆ జిల్లాల్లో హైఅలర్ట్..
ఇక ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో హైఅలర్ట్ను ప్రకటించారు పోలీసులు. సున్నిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. అటు టీ రాజా సింగ్ అరెస్ట్ను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు కూడా ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications