కాంగ్రెస్కు టీఆర్ఎస్ సపోర్ట్: కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: రైతులకు కీలక సూచన చేసిన బండి సంజయ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అంచనాలకు మించి రాణించింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీ కొట్టి నిలిచింది. గులాబీ పార్టీతో పోటీ పడుతూ 48 స్థానాలను గెలుచుకోగలిగింది. ఇదే ఊపును కొనసాగిస్తోంది బీజేపీ. భారత్ బంద్కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించడాన్ని తప్పు పట్టింది. తెలంగాణలో అమల్లో ఉన్నవన్నీ రైతాంగ వ్యతిరేక కార్యక్రమాలేనని, ముందు వాటిని సరిదిద్దుకోవాలంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధినేత బండి సంజయ్ సూచించారు. భారత్ బంద్లో తెలంగాణ రైతులెవరూ పాల్గొనవద్దని పిలుపునిచ్చారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా..
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ రైతులు గురువారం భారత్ బంద్ను నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. దీనికి బీజేపీయేతర పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. బంద్ను విజయవంతం చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్ష పార్టీల నేతలు సంయుక్తంగా ఈ బంద్లో పాల్గొనబోతున్నారు. ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రోడ్లపై బైఠాయించనున్నారు.
తప్పు పడుతోన్న బీజేపీ
భారత్ బంద్కు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడాన్ని బండి సంజయ్ తప్పు పడుతున్నారు. రైతులకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్, టీఆర్ఎస్కు పెద్ద తేడా లేదని అన్నారు. తన ఆరేళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ రైతులకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. అలాంటి పార్టీ రైతులకు అండగా నిలవడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పంటరుణాలు మాఫీ పేరుతో హామీలు గుప్పించిన టీఆర్ఎస్ నేతలు.. అధికారాన్ని అందుకున్నాక వాటిని విస్మరించారని, పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా రైతులను మోసం చేశారని ఆరోపించారు.
రైతులకు రుణమాఫీ ఏదీ?
రుణాలను మాఫీ చేస్తామని రైతులను నమ్మించిన టీఆర్ఎస్ నేతలు తొలుత ఆ హామీని నెరవేర్చాలని బండి సంజయ్ అన్నారు. రుణమాఫీ పథకాన్ని అమలు చేయడాన్ని ఆలస్యం చేశారని, ఇప్పటికైనా కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. . లక్ష రూపాయల లోపు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వని కారణంగా రైతులు 13 శాతం వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తున్నారని గుర్తు చేశారు.
ఫసల్ బీమా పథకం అమలవుతోందా?
రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు కావట్లేదని బండి సంజయ్ అన్నారు. ఫలితంగా రైతులు అకాల వర్షాలు, కరవుతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కార్కు రైతుల పట్ల ఉన్న ప్రేమ ఏ పాటిదో ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడం స్పష్టం చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులను మంజూరు చేయట్లేదని, సూక్ష్మ సేద్యానికి నీటి సరఫరా అందట్లేదని చెప్పారు. కేంద్రం ఇస్తోన్న నిధులతో టీఆర్ఎస్ నాయకులకు ట్రాక్టర్లు కొనిస్తున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్కు ఆ హక్కు లేదు..
రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కు లేదని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కేసీఆర్ తన తాబేదార్లు, పార్టీ నాయకులను నియమించుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు, సభ్యులు దళారులతో కుమ్మక్కై రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. దీన్ని ప్రశ్నించిన రైతులను జైళ్లపాలు చేస్తున్నారని, ఇప్పటికైనా కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే మార్కెట్ కమిటీలను రద్దు చేసి, వాటి నిర్వహణను రైతుసంఘాలకే అప్పగించాలని అన్నారు.
Recommended Video
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడమా?
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం పట్ల బండి సంజయ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రేరేపిత బంద్లో పాల్గొనడం టీఆర్ఎస్ రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెడుతోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞత లేకుండా మాట్లాడటం సరికాదని అన్నారు. రాజకీయ అవసరాల కోసం రైతులను రెచ్చగొట్టొద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులెవ్వరూ కూడా ఈ బంద్ లో పాల్గొనద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.