షాక్: 'కీలకనేతలంతా బిజెపితో టచ్లో, ఆర్నెళ్ళలో కాంగ్రెస్ ఖాళీ'
హైదరాబాద్: టిఆర్ఎస్ నాయకత్వానికి అధికార వ్యామోహం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. టిఆర్ఎస్ నేతలు ఆత్మహత్యలు చేసుకొన్నా కనీసం స్పందించే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు.టిఆర్ఎస్ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టనున్నట్టు ప్రకటించారు లక్ష్మణ్. పలు పార్టీలకు చెందిన హేమా హేమీలంతా బిజెపిలో చేరతారని లక్ష్మణ్ ప్రకటించారు.
టిఆర్ఎస్కు చెందిన తాండూరు నియోజకవర్గ నేత అయూబ్ఖాన్ మృతి చెందిన ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ శుక్రవారం నాడు స్పందించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ భవన్కు టులెట్ బోర్డు పెట్టే పరిస్థితి రానుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
2019 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అన్ని రకాల వ్యూహలను అమలు చేయనున్నట్టు చెప్పారు డాక్టర్ లక్ష్మణ్ . రాష్ట్రంలో త్వరలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలు ఉన్నాయని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
దక్షిణాదిలో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం వ్యూహలను రచిస్తోంది.ఈ వ్యూహలను అమలు చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం ఉంది.

టిఆర్ఎస్ భవనానికి టులెల్ బోర్డు
త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సమితి భవనానికి టులెట్ బోర్డు పెట్టనున్నట్టు లక్ష్మణ్ జోస్యం చెప్పారు. అధికారం తప్ప ఇతర విషయాలు టిఆర్ఎస్కు పట్టడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణిని అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఖాళీ
రానున్న ఆరు మాసాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కానుంది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో బిజెపి నాయకత్వం చర్చలు జరుపుతోందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో లక్ష్మణ్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకొంది.ఇప్పటికే కొందరు నేతలు బిజెపి నాయకత్వంతో టచ్లో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

అమిత్షా టూర్
త్వరలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో అమిత్షా రెండో దఫా పర్యటన చేయాల్సి ఉండింది. కానీ, రాష్ట్రపతి ఎన్నికలతో పాటు ఇతరత్రా పార్టీ వ్యవహరాలను దృష్టిలో ఉంచుకొని పర్యటన వాయిదా పడింది. అమిత్షా రెండో దఫా పర్యటన నాటికి తెలంగాణలో కీలక నేతలంతా బిజెపిలో చేరేలా ఆ పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది.

క్షేత్రస్థాయి నుండి బిజెపి బలోపేతం
తెలంగాణలో బిజెపిని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తున్నారు. 2019 నాటికి అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహంపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే రాష్ట్ర నేతలకు దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలు పనిచేస్తున్నారు. ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను బిజెపిలోక ఆహ్వనిస్తున్నారు.












Click it and Unblock the Notifications