'మోడీ సర్వే చేశారా.. తూచ్': కేసీఆర్కు షాక్, బాబుకు ఊరట
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏం చేశారని ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ మొదటి ర్యాంక్ ఇస్తారని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు సోమవారం నాడు ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కంటే తక్కువ..! నాకు ఆ ర్యాంక్ ఇస్తారా: మోడీపై బాబు అసహనం
కేంద్రం ఏ రాష్ట్రం పైన సర్వే చేయలేదని ఆయన చెప్పారు. తెలంగాణకు, ముఖ్యమంత్రి కేసీఆర్కు మొదటి ర్యాంకు ఇచ్చారనేందుకు ఏలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఫస్ట్ ర్యాంకు ఇచ్చిందన్న తప్పుడు వార్తల పైన ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. మొత్తం వ్యవహారాన్ని సమాచార శాఖ విచారణ చేస్తోందని చెప్పారు.
కాగా, ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల పైన సర్వే నిర్వహించారని, ఈ సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్కు మొదటి ర్యాంకు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అయిదో ర్యాంకు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పదమూడో ర్యాంకు వచ్చిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
చంద్రబాబుకు పదమూడో ర్యాంకు కాదని, అయిదో ర్యాంకు వచ్చిందని టిడిపి నేతలు చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే, తనకు అయిదో ర్యాంకు ఇవ్వడంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా అసంతప్తి వ్యక్తం చేశారని అన్నారు. కానీ, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం మోడీ చేశారని చెబుతున్న సర్వే అంతా తూచ్ అంటున్నారు. కేంద్రం సర్వే చేయలేదని చెబితే అది చంద్రబాబుకు ఊరట అని చెప్పవచ్చు.