టిడిపితో తెగదెంపులు: అమిత్ షాతో తెలంగాణ బిజెపి నేతల మొర
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టిడిపితో పొత్తు వల్ల నష్టపోతున్నామని తెలంగాణ బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని వారు ఇటీవల తమ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు వినిపించారు.
తెలుగుదేశంతో పొత్తు కారణంగానే తమకు పరాజయాలు ఎదురవుతున్నాయన్నది తెలంగాణ బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వరంగల్ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి రావడానికి టిడిపినే కారణమని వారు నిందిస్తున్నారు. తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చాయి.
గ్రేటర్ కోటలో పాగా వేయాలంటే పొత్తు తప్పనిసరి అని రెండు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. సాధారణ ఎన్నికల్లో సాధించిన ఫలితాల మాదిరిగానే వస్తాయని రెండు పార్టీలు కూడా భావించాయి. 150 డివిజన్లను పంచుకున్నాయి. తెలుగుదేశం పార్టీ 90 డివిజన్లలో పోటీ చేయగా బీజేపీ 65 డివిజన్లలో బరిలో దిగింది.

కొన్ని స్థానాల్లో తమ అభ్యర్థులకు రెండు పార్టీలు బీఫామ్ ఇవ్వడంతో అయోమయం చోటు చేసుకుంది. ఆ స్థానాల్లో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని నాయకులు చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా రెండు పార్టీలు కత్తులు దూసుకున్నాయి.
ఫలితాలు టిడిపి, బిజెపి నేతలకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. బీజేపీ కేవలం నాలుగు డివిజన్లలో మాత్రమే విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క స్థానాన్నే గెల్చుకుంది. కలసి పోటీ చేసినా సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో బీజేపీ ఆలోచనలో పడింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే తమకు నష్టం జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చింది.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాము కీలక పాత్ర పోషించినప్పటికీ తగిన ఫలితాలు రాకపోవడానికి తెలుగుదేశం పార్టీతో పొత్తే కారణమని బిజెపి నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఓ వారం కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారని అంటున్నారు.
దాదాపు గంటపాటు అమిత్ షా ఎయిర్పోర్టులో వున్నారు. ఆ గంటసేపూ తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితిపై చర్చించారు. కొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలను చర్చించారు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడుతోందని అమిత్షాతో చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ బీజేపీ నేతల అభిప్రాయాలను విన్న అమిత్ షా మాత్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అంటున్నారు. ఇది ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయం కాదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ నెలాఖరుకల్లా మండలాలు, జిల్లాల వారీగా కమిటీలు పూర్తి చేయాలని సూచిస్తూ వెళ్లిపోయారని అంటున్నారు.












Click it and Unblock the Notifications