తెలంగాణలోని పల్లెలకు మహర్దశ.. ఆ జిల్లాల్లోని పల్లెల్లో కొత్త రోడ్లు..
ములుగు జిల్లా సహా పలు జిల్లాల్లో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ దఫా మొత్తం రూ.74.43 కోట్ల నిధులతో 32 కొత్త రహదారుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణ రహదారులు పల్లె ప్రజల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయని, కొత్త రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని పేర్కొన్నారు. పల్లెల మధ్య అనుసంధానం పెరిగి, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించగలరని, విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు వంటి వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని ఆమె తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. "గ్రామీణ ప్రాంత అభివృద్ధి మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రహదారులు, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు.. ప్రతి రంగంలో ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటోంది" అని తెలిపారు.
ములుగు జిల్లాలోని గిరిజన ఆదివాసి ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, అక్కడి పల్లెలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్న దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కొత్త రహదారుల నిర్మాణం ద్వారా పల్లెల మధ్య రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా పర్యాటక అవకాశాలు కూడా పెరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

"ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రూ.74.43 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కొత్త దశకు చేరుతుంది. రహదారులు మాత్రమే కాదు, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలే మారిపోతాయి. మరింత అభివృద్ధి పల్లెల తలుపు తడుతుంది" అని సీతక్క స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications