రేవంత్ మార్క్: అమ్మోరి దయ- తినబోతూ రుచులెందుకు..?
Telangana Budget 2024: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటోన్నారు. ఒకరి పాలన లోపాలను మరొకరు ఎత్తి చూపుతోన్నారు. ఘాటు విమర్శలను సంధించుకుంటోన్నారు.
అదే సమయంలో- ఆర్థిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ప్రతిపాదనలు సభకు సమర్పించనున్నారు. ఈ నెల 27వ తేదీన బడ్జెట్పై చర్చ మొదలవుతుంది. 29, 30, 31వ తేదీల్లో పలు బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రత్యేకించి- ద్రవ్యవినిమయ బిల్లు 31వ తేదీన సభ ముందుకు రానుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టబోతోన్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సందరించుకుంది. గతంలో రేవంత్ సర్కార్.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సంక్షేమం, అభివృద్ధి రంగాలకే బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.
బడ్జెట్ ప్రతిపాదనలు మొత్తం 2.95 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో అధిక వాటా ఆరు గ్యారంటీలకు దక్కొచ్చు. ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి 75,000 కోట్ల రూపాయల వరకు నిధులను కేటాయిస్తారని సమాచారం. ఇందులో కూడా వ్యవసాయ మంత్రిత్వ శాఖకే అధిక మొత్తం ఉంటుందని అంటున్నారు.
కాగా- బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టడానికి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లడానికి ముందు హైదరాబాద్ బేగంపేట్లో గల జ్యోతిబా ఫులే ప్రజా భవన్లో గల నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు భట్టి విక్రమార్క. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన నేరుగా సచివాలయానికి చేరుకుంటారు. బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గ ఆమోదం తీసుకుంటారు.












Click it and Unblock the Notifications