తెలంగాణలో లాక్డౌన్ ఉంటుందా.. సీఎస్ సోమేశ్ కుమార్ రియాక్షన్ ఇదే.. హైకోర్టు సూచనపై కీలక వ్యాఖ్యలు
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ లాక్డౌన్ విధించవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వీకెండ్ లాక్డౌన్పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ ప్రచారం మరింత పెరిగింది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లాక్డౌన్ విధించడంపై స్పష్టతనిచ్చారు.
Recommended Video
లాక్డౌన్ ఉంటుందా...
వీకెండ్ లాక్డౌన్పై హైకోర్టు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని సోమేశ్ కుమార్ తెలిపారు. అదే సమయంలో కరోనా సమస్యకు లాక్డౌన్ పరిష్కారం కాదని పేర్కొన్నారు. దానివల్ల పెద్దగా ఉపయోగమేమీ ఉండదని.. ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని అన్నారు. ఢిల్లీలో లాక్డౌన్ కారణంగానే రాష్ట్రానికి టెస్టింగ్ కిట్లు రావడం లేదన్నారు. లాక్డౌన్ అవసరమైనప్పుడు సీఎం కేసీఆర్,కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. లాక్డౌన్ కంటే ప్రజలకు మంచి చికిత్స అందించడం ముఖ్యమని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది : సోమేశ్ కుమార్
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని సోమేశ్ కుమార్ తెలిపారు. స్థానిక అవసరాలు, అక్కడి పరిస్థితులను బట్టి పొరుగు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా నివారణకు వైద్యులు,సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని... ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
కేసీఆర్ కరోనా బారినపడినప్పటికీ...
మెడికల్ ట్రీట్మెంట్కు హైదరాబాద్ నగరం క్యాపిటల్గా మారిందని సోమేశ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా కరోనా రోగులు చికిత్స కోసం ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. గత 15 రోజుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి 33 మెడికల్ ఎయిర్ అంబులెన్సులు హైదరాబాద్ వచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్ కరోనా బారినపడినప్పటికీ... రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనతో పాటు వైద్యారోగ్య శాఖ అధికారులతో చర్చిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ మేనేజ్మెంట్ పకడ్బందీగా జరుగుతోందని చెప్పారు.
హైకోర్టు కీలక సూచన...
అంతకుముందు,తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో టెస్టులు సంఖ్య తగ్గించి కేసులు తగ్గాయని చెప్పడమేంటని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.టెస్టులు ఎందుకు పెంచడం లేదని నిలదీసింది. ఒక్క రోజు కూడా లక్ష టెస్టులు దాటలేదని...కేవలం రాత్రిపూట కర్ఫ్యూ విధించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో వీకెండ్ లాక్ డౌన్పై ఈనెల 8 వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్,ఆక్సిజన్ సప్లైకి సంబంధించిన డేటాను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.