సిటీలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లకు గ్రీన్ సిగ్నల్, 1000 కోట్లు చాలు: అరుణ
హైదరాబాద్: భాగ్యనగరంలో మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. నగరంలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం శుక్రవారం నాడు అనుమతులు మంజూరు చేసింది.
మొదటి దశలో ఇరవై చోట్ల మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2,630 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈపీసీ టెండర్ల ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడతారు.
రెండున్నర సంవత్సరాలలో ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాదు నగరాన్ని సిగ్నలింగ్ వ్యవస్థ లేని రవాణా వ్యవస్థగా మార్చుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెబుతోన్న విషయం తెలిసిందే.
పాలమూరు ప్రాజెక్టుపై డికె అరుణ ఆగ్రహం
పాలమూరు ప్రాజెక్టుల పైన అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపిల మధ్య వాగ్యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. పాలమూరు ప్రాజెక్టుల పైన డికె అరుణ మరోసారి మండిపడ్డారు.
కొత్త ప్రాజెక్టులకు బదులు పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రజలకు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్, టిడిపిలు చెబుతున్నాయి. కొత్త ప్రాజెక్టుల పైన ఇరు పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
శుక్రవారం నాడు మాజీ మంత్రి డికె అరుణ మాట్లాడుతూ.. రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని, అవి ప్రజలకు ఉపయోగంలోకి వస్తాయని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులను ప్రభుత్ం ఆదుకోవాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల పైన అఖిలపక్షం ఓ డ్రామా అన్నారు.