ఫెడరల్ ఫ్రంట్: మాజీ ప్రధాని దేవేగౌడతో కెసిఆర్ భేటీ, సీఎంతో పాటు ప్రకాష్రాజ్
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ సీఎం కెసిఆర్ బెంగుళూరులో జనతాదళ్ (ఎస్) నేత, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడతో శుక్రవారం నాడు బెంగుళూరులో సమావేశమయ్యారు. దేవేగౌడ నివాసానికి చేరుకొన్న కెసిఆర్ ఆయనతో దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ సీఎం కెసిఆర్తో పాటు సినీ నటుడు ప్రకాష్రాజ్ కూడ బెంగుళూరు వెళ్ళారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ శుక్రవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు వెళ్ళారు. సీఎం వెంట సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎంపీ వినోద్, సంతోష్ కుమార్, సుభాష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
దేశంలో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు ఇందులో భాగంగా చర్చలు జరిపేందుకు దేవేగౌడ ఇంటికి వెళ్ళారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి తెలంగాణ సీఎం కెసిఆర్ను ఆహ్వనించారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడంపై కెసిఆర్ దేవేగౌడతో చర్చిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్లో ఏ రకమైన వ్యూహన్ని అనుసరించాలనే దానిపై వీరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడతో జరిగిన సమావేశంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడ పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ను ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా కలుసుకొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై ఆ సమావేశంలో చర్చలు జరిగినట్టు సమాచారం. బెంగుళూరు పర్యటనలో ప్రకాష్ రాజ్ను కూడ కెసిఆర్ తీసుకెళ్ళారు.
గత మాసంలోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని కెసిఆర్ కలుసుకొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించారు. జార్ఖండా మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ హైద్రాబాద్కు వచ్చి కెసిఆర్తో సమావేశమయ్యారు.కర్ణాటక ఎన్నికలు సాగుతున్న తరుణంలో జెడి(ఎస్) అధినేత హెచ్ డి దేవేగౌడతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.