డ్రగ్స్ను సమూలంగా నిర్మూలించాలి.. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటుకు కేసీఆర్ ఆదేశం
తెలంగాణలో మాదకద్రవ్యాల కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీస్తున్న డ్రగ్స్ మాఫియా అగడాలకు చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరం అన్నారు. ఈమేరకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని ఆధికారులను సూచించారు. అత్యాధునికతో కూడిన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడినవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.

డ్రగ్స్పై ఉక్కుపాదం
తెలంగాణలో గంజాయి, నార్కొటిక్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సమూలంగా నిర్మూలించడానికి వినూత్నరీతిలో ఆలోచించాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. దీనిని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్నాయని ప్రశంసించారు.

1000 మందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలో అభివృద్ధి దిశగా తెలంగాణ దూసుకుపోతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజానికి ఇది చీడ పురుగు వంటిదని పేర్కొన్నారు. ప్రజలను డ్రగ్స్కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పోలీస్లకు అవార్డులు, రివార్డులు
రాష్ట్రంలో ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను, వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని సీఎం కితాబు ఇచ్చారు. అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు రివార్డులు, ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందనీ సీఎం స్పష్టం చేశారు.

ఎంతటి వారైనా వదిలేది లేదు
డ్రగ్స్ నియంత్రణ విషయంలో పట్టుబడిన వారు ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏ పార్టీకి చెందిన వారైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులు చేసినా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
.












Click it and Unblock the Notifications