కరోనా పోరులో కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. అలా చెప్పుకుంటే గౌరవం ఉండదు: కేసీఆర్
కరోనావైరస్ పోరులో కేంద్రం రాష్ట్రానికి చేసిన సహాయం ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అరకొర సహాయం ఎందుకు పనికిరాదని సీఎం చెప్పారు. కరోనా వైరస్ను ఎదుర్కొనడంలో రాష్ట్రప్రభుత్వం సొంతంగా ఎవరి సహాయం లేకుండా పనిచేస్తోందని చెప్పారు.
రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది..?
కరోనా కట్టడికి రాష్ట్రానికి ఏదో చేశామని కేంద్రమంత్రులు వట్టి మాటలు చెప్పడం మానేయాలని అలా చెప్పి తమను తాము దిగజార్చుకునే కార్యక్రమం చేయొద్దని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజల్లో గౌరవం కోల్పోతారని చెప్పారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణకు రూ. 256 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని అది కూడా రాష్ట్ర వాటాలో భాగంగానే వచ్చాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మరో రూ.90 కోట్లు కూడా వచ్చాయని ఇవి కూడా ఇతర నిధులను అడ్జెస్ట్ చేసి ఇచ్చారని సీఎం సభకు తెలిపారు.
ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని చెబితే...
కేంద్రం 647 వెంటిలేటర్లను అందించిందని అయితే ఇందులో ఒక్కటి కూడా ఉచితంగా ఇవ్వలేదని వెల్లడించారు. వీటికోసం బడ్జెట్లోని ఇతర కార్యక్రమాలకు కేటాయించిన డబ్బులను అడ్జెస్ట్ చేసి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఇక రుణ విధానంలో మార్పులు చేయాలన్న రాష్ట్ర డిమాండ్ను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు సీఎం కేసీఆర్. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని రాష్ట్రం డిమాండ్ చేసిందని చెప్పిన సీఎం కేసీఆర్... దాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు పరిమితిని పెంచుతూనే దాన్ని మరో కార్యక్రమంకు ముడిపెట్టిందని చెప్పారు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినందున ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచి దీనికి ముడిపెట్టారని సీఎం వెల్లడించారు.
కరోనా కేంద్రానికి రాష్ట్రాలకు గుణపాఠం నేర్పింది
కరోనావైరస్ను తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే మరణాల రేటు తక్కువగా ఉందని వివరించారు. అంతేకాదు రికవరీ రేటు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉందని చెప్పారు. ఇక ఆరోగ్య రంగానికి నిధులు ఎక్కువగా కేటాయించాలనే గుణపాఠం కోవిడ్ -19 అటు కేంద్రానికి ఇటు రాష్ట్రాలకు నేర్పిందని చెప్పారు. అంతేకాదు ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయాలని చెప్పిన కేసీఆర్.. ఇకపై ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభకు వివరించారు.
Recommended Video
ప్రజలను విపక్షాలు భయాందోళనలోకి నెట్టివేస్తున్నాయి
ప్రభుత్వ హాస్పిటల్స్లో వెంటిలేటర్లు చాలా తక్కువగా ఉండేవని దీంతో ప్రభుత్వమే సొంతంగా 700 నుంచి 800 వెంటిలేటర్లను కొనుగోలు చేసిందని చెప్పారు. అంతేకాదు 10వేల ఆక్సిజన్ సపోర్టు ఉన్న పడకలను ఏర్పాటు చేశామని చెప్పారు. కోవిడ్-19 కోసం ప్రత్యేక హాస్పిటల్స్, కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. సాధారణంగా ప్రజలు భయంతోనే ఎక్కువగా మరణిస్తున్నారని అయితే తమ ప్రభుత్వం అవగాహన కార్య క్రమాలు చేపడుతోందని చెప్పారు. ప్రజల్లో భయాందోళనలు తీసివేసే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతోందని వెల్లడించారు. విపక్షాలు కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.