అరెస్టు చేస్తారంట!: ఢిల్లీ పోలీసుల నోటీసులపై రేవంత్ రెడ్డి సంచలనం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ వ్యవహారంలో తనతోపాటు పలువురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తనను అరెస్టు చేస్తారంట అంటూ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ గాంధీభవన్లో ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారంట.. ఉన్న ఏజెన్సీలు చాలవన్నట్లు.. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా వాడుకుంటున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇచ్చారన్నారు.

నరేంద్ర మోడీ ఇప్పటి వరకు విపక్షాలపై సీబీఐ, ఈడీని ప్రయోగించారని ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు ఢిల్లీ పోలీసులనూ ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎవరూ భయపడేవాళ్లు లేరన్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో బీజేపీని ఓడీంచి తీరుతామని రేవంత్ చెప్పుకొచ్చారు.
కర్ణాటకలోని సేడం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గుజరాత్ మోడీకి అండగా ఉన్నట్లే.. కర్ణాటక మల్లిఖార్జున ఖర్గేకు అండగా నిలవాలని కోరారు. కర్ణాటక నుంచి 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను కర్ణాటక వర్సెస్ గుజరాత్గా అభివర్ణించారు.
ఐదు గ్యారంటీలను కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ కచ్చితంగా అమలు చేసిందన్నారు రేవంత్. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ అధికారం చేజిక్కుంచుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసిందని చెప్పుకొచ్చారు. పదేళ్లలో మోడీ సర్కార్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 27 ఎంపీ సీట్లు అనుకూలంగా మీరు ఇచ్చారు. కానీ నరేంద్ర మోడీ మీకు ఇచ్చింది ఖాళీ చెంబు మాత్రమే. మీకు కరవు వస్తే కనీసం మీకు తాగటానికి కనీసం బెంగళూరుకు నీరు కూడా ఇవ్వలేదు. అటువంటి ప్రధానికి ఓటేస్తారో.. మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ఖర్గేకు ఓటేస్తారో మీరే ఆలోచన చేయండి అని గుర్మిట్కల్ పార్లమెంట్ ప్రచారంలో రేవంత్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications