ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశాలు: 18న కేబినెట్ భేటీ
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వర్షాకాలం ప్రారంభం కాకముందే పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత బుధవారం తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో వివిధ అంశాలపై కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమాలోచనలు జరిపారు.
అకాల వర్షాలతో రైతులు నష్టపోవడం ధాన్యం తడిసిపోవడంపై ఏం చేయాలనే అంశంపై చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సీఎం చర్చించారు. రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు వివిధ మార్గాలను చర్చించారు.

రూ.2 లక్షల రుణమాఫీ కోసం విధివిధానాలు, ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలన్నారు. నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రైతు రుణమాఫీ కోసం మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లలో దళారుల జోక్యం లేకుండా చూడాలన్నారు సీఎం రేవంత్. రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిస్కృతంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు మే 18న తెలంగాణ మంత్రి మండలి భేటీ కావాలని నిర్ణయించారు. ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్.. అధికారులను ఆదేశించారు. పెండింగ్ అంశాలపై పరిష్కారానికి కార్యాచరణ తయారు చేయాలన్నారు.
రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలన్నారు సీఎం రేవంత్. క్లిష్టమైన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. జూన్ తర్వాత ఏపీ ఆధీనంలోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications