రాహుల్ వచ్చేసారు - వరంగల్ సభలో కీలక ప్రకటన : ఒక్కటిగా కాంగ్రెస్ నేతలు..!!
కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న రాహుల్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్..సీఎల్పీ నేత భట్టి స్వాగతం పలికారు. పలువురు పార్టీ నేతలు సైతం శంషాబాద్ కు తరలివచ్చారు. శంషాబాద్ లో కొద్ది సేపు విరామం తీసుకున్న రాహుల్ ..టీపీసీసీ నేతలతో మంతనాలు జరిపారు. రాహుల్ వరంగల్ కు బయల్దేరగా.. వెంట రేవంత్ రెడ్డి..భట్టి విక్రమార్క ఉన్నారు. రెండు నెలల క్రితం ఢిల్లీలో రాహుల్ తెలంగాణ ముఖ్య నేతలతో నిర్వహించిన సమీక్షలో చేసిన మార్గనిర్దేశకం అనుగుణంగా నేతలంతా ఈ పర్యటన సమయంలో మాత్రం ఒక్కటిగానే సాగుతున్నారు.
ఇప్పటికే కీలక నేతలంతా తమ సొంత జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాలను వరంగల్ కు తరలించారు. నేతుల సైతం వరంగల్ చేరుకున్నారు. జనసమీకరణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. జగ్గారెడ్డి.. శ్రీధర్ బాబు.. భట్టివిక్రమార్క ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక, వరంగల్ రైతు సభలో రాహుల్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారింది. సభ పేరు రైతు సంఘర్షణ సభగా పేరు ఖరారు చేయటంతో.. రైతులకు సంబంధించి కొన్ని అంశాలను రాహుల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గంట సేపు రాహుల్ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. అందులో తెలంగాణ ఏర్పాటు నుంచి ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల పైన విమర్శలు చేసే అవకాశం ఉంది. రాహుల్ తన ప్రసంగంలో వ్యవసాయ ఉత్పత్తులు, రుణమాఫీ, మద్దతుధర తదిత రాలపై రాహుల్ కీలక ప్రకటనలు, హామీలు ఇవ్వనున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఇబ్బందులను ఎత్తి చూపడంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాలకు మార్గనిర్దేశం చేయనున్నారు. సభ ముగిసిన తరువాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
శనివారం నగరంలోనే పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారు. అందులో భాగంగా గాంధీ భవన్ కు రాహుల్ రానున్నారు. టీపీసీసీ నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలో తీసుకువచ్చేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణపై మాట్లాడుతారు. 2:50 నుంచి 3:50 గంటల వరకు.. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభ్య త్వ నమోదు చేసిన కోఆర్డినేటర్లతో భేటీ అవుతారు. వారితో ఫొటోలు దిగుతారు. రేపు సాయంత్రం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.