మోడీని కలిసిన కోమటిరెడ్డి: అరగంటలో ప్రధాని అపాయింట్మెంట్: ఏం జరుగుతోంది?
యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి- ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిన తరువాత ఆయన ప్రధానిని కలిశారు. కొన్ని డిమాండ్లు, మరికొన్ని ఫిర్యాదులతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించిన అరగంటలోనే మోడీ అపాయింట్మెంట్ లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆసక్తికర పరిణామాల మధ్య..
వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్న తెలంగాణ రాజకీయాల గురించి, టీఆర్ఎస్ పరిపాలన గురించి ఆరా తీయడానికి ప్రధాని ఎంత ఆసక్తిగా ఉన్నారనేది దీనితో స్పష్టమౌతోంది. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించడం, తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించడం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్లో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- కోమటిరెడ్డి ప్రధానిని కలుసుకోవడం ఆసక్తి రేపుతోంది.

పెండింగ్ అంశాలపై
ప్రధానిని కలిసిన అనంతరం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆయనను కలవడానికి గల కారణాలను వివరించారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంటూ వస్తోన్న ఒకట్రెండు ప్రాజెక్టుల గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని, వాటిని పరిష్కరించాలని కోరానని అన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.
నమామి గంగే ప్రాజెక్టు తరహాలో మూసీని ప్రక్షాళన చేయాలని, కాలుష్య కాసారంలో ఉన్న నీటిని శుద్ధి చేయకుండా దిగువకు విడుదల చేయడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోమటిరెడ్డి చెప్పారు. దీనికోసం నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ..
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించాలని కోరగా.. ప్రధాని సానుకూలంగా స్పందించారని అన్నారు. రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయని, వాటిని నివారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీన్ని ఆరులేన్లుగా విస్తరించాలని ప్రధానిని కోరానని కోమటిరెడ్డి అన్నారు. వీటన్నింటి పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారని, అలాగే తెలంగాణ రాజకీయ స్థితిగతులు గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు.

సింగరేణిలో కుంభకోణం..
దక్షిణాదిలో అతిపెద్ద బొగ్గు గనులు ఉన్న సింగరేణి క్యాలరీస్లో 50 వేల కోట్ల రూపాయల మేర కుంభకోణం చోటు చేసుకునే అవకాశం ఉందనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని కోమటిరెడ్డి చెప్పారు. కోల్ ఇండియా మార్గదర్శకాలకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు సింగరేణి మైనింగ్ టెండర్లను కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. బొగ్గు గనుల్లో జాయింట్ వెంచర్లు ఉండగా.. సింగరేణిలో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.

తెలంగాణ స్థితిగతులపై ఆరా..
తెలంగాణలో రాజకీయ స్థితిగతులపై గురించి కూడా ప్రధాని ఆరా తీశారని కోమటిరెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తీరును అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణాపై తాను దృష్టి సారిస్తానని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు. సింగరేణి క్యాలరీస్ సహా ఎక్కడెక్కడ అవినీతి చోటు చేసుకుంటోందనే విషయాన్ని తాను ప్రధానికి వివరించానని కోమటిరెడ్డి అన్నారు. వాటితో పాటు పెండింగ్ ప్రాజెక్టులపైనా ప్రధాని తక్షణ చర్యలు చేపడతారని ఆశిస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications