ఇంటర్ పరీక్షలు సొంతగానే: టీ ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: ఇంటర్మీడియేట్ పరీక్షల్ని సొంతంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది. ఆ ప్రభుత్వ విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించేది లేదని తేల్చి చెప్పింది.
ఈ మేరకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించాలని బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్నందున, విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే అవకాశం ఉన్నందున్న ఈ ఏడాది ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
దీనిపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రాలో మార్కులు తక్కువగా వేస్తారని వారిని దృష్టిలో పెట్టుకుని సొంతగా పరీక్షలు నిర్వహించుకుంటామని చెప్పింది. ప్రత్యేక రాష్ర్టాలు ఏర్పడిన నేపథ్యంలో తమ పరీక్షలు తామే నిర్వహించుకోవాడాన్ని ఎందుకు అంగీకరించడంలేదని ప్రశ్నించింది. ఇటీవల 15 రోజలు క్రితం ఇరురాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు ఈ అంశంపై చర్చించారు.
నెలాఖరు వరకూ పాత పద్ధతే రీయింబర్స్మెంట్
పాత పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్, నగదురహిత వైద్యం పథకాలు ఈ నెలాఖరు వరకూ అమలవుతాయి. నగదురహిత వైద్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హెల్త్కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించినా ఈ పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేంత వరకు ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల ఒకటో తేదీ నుంచే నగదురహిత వైద్య విధానాన్ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఈ నెల మూడో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కొత్త పథకాన్ని అర్ధం చేసుకునేందుకు ఆస్పత్రులు, ఉద్యోగులకు కూడా కొంత సమయం పడుతుందని, ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఆదేశాలు వచ్చేంతవరకు కొంత సమయం పడుతుందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. ఈ క్రమంలో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ, దాంతోపాటే పాత పథకాన్ని కూడా ఈ నెలాఖరు వరకూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.