బీఆర్ఎస్ ఓడిపోతే దానికి కారకుడు ఆయనే అవుతారు: ఆరా మస్తాన్ విశ్లేషణ
Aaraa exit polls 2023: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో వివిధ సంస్థలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ వివరాలు అందుతున్నాయి.
తెలంగాణపై ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ (India TV-CNX) నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls)లో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ- అధికార భారత్ రాష్ట్ర సమితికి నిరాశ తప్పదని తేల్చిందీ సర్వే. కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపింది. హస్తం పార్టీకి భారీ సంఖ్యలో సీట్లను గెలుస్తుందని అంచనా వేసింది.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం.. 60. బీఆర్ఎస్ ఈ మేజిక్ ఫిగర్ను అందుకోలేదని అంచనా వేసింది. 31 నుంచి 47 స్థానాలకే పరిమితమౌతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం అసాధ్యమని వివరించింది.
మూడోసారి అధికారంలోకి రావాలనే బీఆర్ఎస్ ఆశలు ఏవీ ఫలించబోవని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ (India TV- CNX exit polls on Telangana) ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగురకపోవచ్చని, కారు జోరు తగ్గుతుందని వివరించింది.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి మోజారిటీని సాధిస్తుందని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ తెలిపింది. ఏకంగా 63 నుంచి 79 స్థానాలతో హస్తం పార్టీ జెండా ఎగురవేస్తుందని తేల్చింది. బీజేపీకి రెండు నాలుగు సీట్లకే పరిమితమౌతుంది. అఖిల భారత్ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్కు అయిదు నుంచి ఏడు సీట్లు దక్కుతాయి.
ఇదొక్కటనే కాదు.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాలేదనీ తేల్చి చెప్పాయి. అటు ఆరా ఎగ్జిట్ పోల్ (Aaraa exit polls) కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధిస్తుందని తెలిపింది.
ఎగ్జిట్ పోల్స్కు అనుగుణంగా- డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ ఓటమి చవిచూడాల్సిన పరిస్థితే ఎదురైతే దానికి ప్రధాన కారకుడు కేటీఆర్ అవుతారని ఆరా మస్తాన్ వ్యాఖ్యానించారు. ఈ సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ సహా తెలంగాణలో నివాసం ఉంటోన్న ఏపీ ప్రజల ఓట్లు చాలా ప్రభావం చూపాయని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి అరెస్ట్ విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సెటిలర్లల్లో తీవ్ర అభద్రతభావాన్ని కలిగించాయని, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేయడానికి వారిని పురిగొల్పిందని అన్నారు.
బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద తప్పిదాల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకటిగా అభివర్ణించారు ఆరా మస్తాన్. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ గెలుపోటములపై ప్రభావం చూపించవచ్చని, ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించే అవకాశం లేకపోలేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications