బీఆర్ఎస్ ప్రచారం కోసం అధికారులపై ఒత్తిడి; బాధతో ఆవిర్భావ వేడుకలు: బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన తెలంగాణ ప్రభుత్వం పై, కెసిఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బాధతో జరుపుకుంటున్నామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
నాలుగు కోట్ల జనాభా కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్షల కోట్లు కేటాయిస్తే నలుగురి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా వదిలేసింది అని బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడిచినా బీఆర్ఎస్ పార్టీ పాలనలోనే ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.

బిజెపి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పిన బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకరిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటులో బిజెపి కీలక పాత్ర పోషించిందని ఆయన నాటి సంఘటనలను గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూర్ఖత్వంతో పాలన కొనసాగిస్తుందని ఆయన విమర్శించారు.
నలుగురి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టుగా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు .రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరలేదని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 21 రోజులు రోజుకో డిపార్ట్మెంట్ చొప్పున బీఆర్ఎస్ కు ప్రచారం చేయాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. మోడీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినా ఆ ఫలాలను తీసుకోవడానికి కెసిఆర్ సిద్ధంగా లేరని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణాప్రజలను తాకట్టు పెట్టారన్నారు. ఒక కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించడానికి బీజేపీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications