తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల వేళ- కేసీఆర్ కీలక ప్రకటన: హామీలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రావతరణ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని అధికార భారత్ రాష్ట్ర సమితి. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. నేడు పదో వసంతంలోకి తెలంగాణ అడుగు పెట్టింది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా జరుపుతోంది.
ఈ నెల 22వ తేదీ వరకు ఈ సంబరాలు కొనసాగనున్నాయి. ఈ 21 రోజులపాటు తెలంగాణ వాడవాడలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను జరుపుకోవడానికి ఇదివరకే ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. సచివాలయం సహా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించింది. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించుకుంటోంది.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము- తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటోన్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు. తెలంగాణను గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. ఎందరో మేధావులు, త్యాగధనులను దేశానికి అందించిందని పేర్కొన్నారు. సాంకేతికరంగంలో పరుగులుపెడుతోందని, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక రంగానికి చిరునామాగా నిలిచిందని ద్రౌపది ముర్ము అన్నారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి మౌనం పాటించారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలువురు అధికారులు ఉన్నారు.
నివాళి అర్పించిన అనంతరం కేసీఆర్ నేరుగా సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 21 రోజుల పాటు నిర్వహించదలిచిన దశాబ్ది వేడుకలను కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు.. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. ఈ పది సంవత్సరాల కాలంలోనే యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష ఆర్థిక సహాయాన్ని చేస్తామని ప్రకటించారు కేసీఆర్. గొల్ల, కురుమలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపడతామని అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నామని స్పష్టం చేశారు.
పోడు భూములకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు భూములపై సర్వ హక్కులు కల్పిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. పోడుభూములకు రైతుబంధు వర్తించేలా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని కేసీఆర్ వివరించారు.












Click it and Unblock the Notifications