తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్: సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు
హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.
ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు డిజిటల్ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు.
ఇప్పటికే ఆయా ఛానళ్లతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఉపాధ్యాయులంతా ఆగస్టు 27 నుంచి పాఠశాలలకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా వ్యాపిస్తున్న క్రమంలో లాక్డౌన్ విధించడంతో విద్యాలయాలు మూతబడిన విషయం తెలిసిందే. అయితే, గత కొద్ది రోజుల క్రితం నుంచే ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టకపోవడంతో పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేకుండా పోయింది.
Recommended Video
ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యాలయాల్లో కూడా ఆన్ లైన్ తరగతులను ప్రారంభించాలని కోరుతూ.. సుమారు నెల రోజుల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది విద్యాశాఖ. ఈ క్రమంలోనే ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతించింది.