కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: ఎల్ఆర్ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్లకు అనుమతి, కానీ..
హైదరాబాద్: ఎల్ఆర్ఎస్పై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది.
రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి నిరాకరించింది.
కొత్తగా చేసిన ప్లాట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా ఉండాల్సిందేనన్న నిబంధనను విధించింది. అయితే కొత్త లేఔట్లు అంటే ఎప్పటి నుంచి వేసిన లేఔట్లు అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పినప్పటికీ, ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేసినట్లు మాత్రం ప్రకటించ లేదు. అనుమతులు ఉన్న క్రమబద్ధీకరణ అయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇక బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ రద్దుకు బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు.