ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే అంబులెన్సులకు గ్రీన్ సిగ్నల్... ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వం...
తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్సుల నిలిపివేత ఆంక్షలను సడలించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ-పాసులు ఉన్నా లేకపోయినా రాష్ట్రంలోకి అనుమతించేలా చర్యలు చేపట్టింది. దీంతో కొద్దిసేపటి క్రితం నుంచి ఏపీ అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతినిస్తున్నారు. ఈ చర్యతో ఏపీ నుంచి అంబులెన్సుల్లో వస్తున్న కోవిడ్ బాధితులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
సూర్యాపేట జిల్లాలోని రామాపురం చెక్ పోస్టుతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం సడలించింది. అంబులెన్సులను అడ్డుకోవద్దన్న కోర్టు మార్గదర్శకాలు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీసులకు అంబులెన్సులను అడ్డుకోవద్దని ఆదేశాలిచ్చింది. దీంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదంగా మారిన అంబులెన్సుల రాకపోకల సమస్య తీరిపోయింది.

ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స నిమిత్తం తెలంగాణకు వచ్చే కోవిడ్ పేషెంట్లకు ఆస్పత్రులు జారీ చేసిన లెటర్స్తో పాటు ఈపాస్ ఉండాలని ప్రభుత్వం నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుమతులు లేని అంబులెన్సులను పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లో అడ్డుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. చివరకు విషయం హైకోర్టు దాకా వెళ్లడంతో... న్యాయస్థానం జోక్యంతో సమస్య పరిష్కారమైంది.
Recommended Video
విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వెంకట కృష్ణారావు ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. జాతీయ రహదారులపై అంబులెన్స్లను ఆపే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఇది రాజ్యాంగం, చట్టాలు, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. అప్పటివరకూ అంబులెన్సులను నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశించింది.












Click it and Unblock the Notifications