గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్... రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం...
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణకు మంగళవారం(సెప్టెంబర్ 27) భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీసు, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయితీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాలని తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు సీఎస్ సూచించారు.
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది.

హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నగరంలో సోమ,మంగళవారాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్లో కంట్రోల్ రూమ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏవైనా ఫిర్యాదులు లేదా సాయం కావాలంటే 040-23202813 నంబర్లో సంప్రదించవచ్చు.
అప్రమత్తమైన విద్యుత్ శాఖ :
హైదరాబాద్లో భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్ అధికారులను ట్రాన్స్ కో శాఖ అప్రమత్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆదేశించారు. మూసీ నది, చెరువుల ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలన్నారు. మూసీలో, చెరువుల్లో నీటి ప్రవాహం పెరిగి ముంపు ఏర్పడే అవకాశం ఉన్నందున విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు భద్రతా చర్యలు పాటించాలన్నారు. విద్యుత్కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను 7382072104, 7382072106, 7382071574. అందుబాటులోకి తీసుకొచ్చారు.
డిగ్రీ,ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా :
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో... ఈనెల 28, 29వ తేదీల్లో జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. వర్షాల కారణంగా ఈ రెండు రోజులు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామని.. పరీక్షలు మళ్లీ ఎప్పుడు జరిపేది తర్వాత ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications