రూ.100కే గజం స్థలం ఇస్తున్న ప్రభుత్వం..ఎవరికో తెలుసా..?
తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలు చాలానే ఉన్నాయి. అయితే జిల్లా కేంద్రాల్లో ఆ పార్టీలకు పార్టీ కార్యాలయాలు లేవు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి ఆఫర్తో ముందుకొచ్చింది. జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు నిర్మించుకోవాలంటే గజం స్థలంను రూ. 100 చొప్పున కేటాయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇది వరకు పార్టీ కార్యాలయాలకు స్థలాలను లీజుకు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పాలసీని సవరించి నామమాత్రపు ధరకు కేటాయించేలా కొత్త పాలసీని రూపొందించింది సర్కార్. ప్రతిపాదించిన పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపడంతో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిం రాజేశ్వర్ తివారీ జీవో 167 జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఓ పార్టీ కార్యాలయానికి స్థలం లీజుకిచ్చి వారు ప్రతినెలా డబ్బు కడుతున్నారా లేదా అని చెక్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసమే ఈ భూకేటాయింపు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు ఎకరాకు మించకుండా గజం భూమిని రూ.100కు కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది చెబుతూనే మరో షరతు విధించింది ప్రభుత్వం. గజం రూ.100కే భూకేటాయింపు జరపాలంటే అది ప్రభుత్వ భూమి అయి ఉంటేనే ఇస్తామని క్లారిటీ ఇచ్చింది. ఇక రాజకీయ పార్టీలకు భూముల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
ఇక అసలే రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కొత్తగా వచ్చిన జీవోతో 28 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు యుద్ధప్రాతిపదికన స్థలం కేటాయించింది ప్రభుత్వం.ఈ మేరకు గజం స్థలం రూ.100 చొప్పున ఎకరాకు మించకుండా భూములు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ జీవో 168 జారీ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్లకు సంబంధిత పార్టీ జిల్లా అధ్యక్షులు గజానికి రూ.100 చొప్పున చెల్లించి, స్థలాలను స్వాధీనం చేసుకోనున్నారు. 28 జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలని కోరుతూ జనవరిలో ఆ పార్టీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత జిల్లాల ఇన్చార్జి మంత్రులతో కలిసి భూములు గుర్తించిన కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ విలువ లేదా మార్కెట్ విలువతో భూములు కేటాయించాలని ప్రతిపాదించారు. రెండు జిల్లాల కలెక్టర్లు ఒకడుగు ముందుకేసి సంబంధిత స్థలాలు రిజిస్ట్రేషన్ విలువకన్నా తక్కువకే ప్రతిపాదించారు. ఈ మేరకు మే 29న టీఎస్ఎల్ఎంఏ ఆమోదించగా, భూములు కేటాయించారు.