గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం.. ఓటర్ల జాబితాకు షెడ్యూల్ విడుదల!
తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగారా మోగనుంది. శాసనమండలికి సంబంధించి కీలకమైన పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు వేగవంతం చేసింది. వచ్చే ఏడాది 2027 మార్చి నెలలో పదవీకాలం ముగియనున్న మహబూబ్నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ అలాగే వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడనున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్తగా సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల అధికార యంత్రాంగం అధికారికంగా పూర్తిస్థాయి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ప్రజా నోటీసును విడుదల చేయనున్నారు.

ఈమేరకు వరంగల్-ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ స్థానానికి సంబంధించిన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రక్రియలో అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలతో జాబితాను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ నెల 28నుండి నవంబర్ ఆరో తేదీ వరకూ 01/11/2026 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కనీసం 3 సంవత్సరాలు పూర్తవ్వాలని పేర్కొన్నారు.
సాధారణ శాసనసభ, సార్వత్రిక ఎన్నికల్లాగా ఈ ఓటర్ల జాబితా శాశ్వతం కాదని ప్రతి ఎన్నికకూ మునుపటి ఓటర్ల జాబితా రద్దవుతుంది, కాబట్టి గతంలో ఓటు హక్కు ఉన్నవారైనా తప్పనిసరిగా కొత్తగా ఫారం-18 ద్వార దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ఫారం-18 దరఖాస్తులను సమర్పించాల్సి ఉండగా, దానికి నవంబర్ 6వ తేదీని తుది గడువుగా ఖరారు చేశారు.
దరఖాస్తుల పరిశీలన అనంతరం నవంబర్ 20వ తేదీ నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణ పనులు పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీన అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ముసాయిదా జాబితా విడుదలైన నాటి నుంచి, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులు లేదా క్లెయిమ్లను స్వీకరిస్తారు.
ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు మరియు విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి డిసెంబర్ 25 నాటికి వాటిని పూర్తిగా పరిష్కరించనున్నారు. అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత డిసెంబర్ 30వ తేదీన పట్టభద్రుల నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. గతంలో పాత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ ఈసారి కొత్తగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి.












Click it and Unblock the Notifications
