మందుబాబులకు హైకోర్టు గుడ్ న్యూస్: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే..
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అనగానే వాహనదారులకు గుర్తొచ్చేది బండి సీజింగ్. కానీ, ఇకపై ఆ ఆటలు సాగవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం తాగి వాహనం నడిపారనే సాకుతో వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసు అధికారులకు లేదని హైకోర్టు పునరుద్ఘాటించింది. ఈ మేరకు గతంలో ఉన్న ఆదేశాలను అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.
జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ ఈ కేసును విచారిస్తూ.. మోటారు వాహనాల చట్టం ప్రకారం పోలీసులకు ఉన్న పరిమితులను గుర్తుచేశారు.

- సీజింగ్ పవర్ లేదు: డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు కానీ, వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించకూడదు.
- ప్రత్యామ్నాయం చూపాలి: ఒకవేళ డ్రైవర్ ఒక్కడే ఉండి, బండి నడపలేని స్థితిలో ఉంటే.. పోలీసులు వెంటనే అతని బంధువులకు లేదా స్నేహితులకు సమాచారం అందించాలి. వారు వచ్చి వాహనాన్ని తీసుకెళ్లేలా చూడాలి.
- లైసెన్స్ ఉన్న వ్యక్తికి అప్పగించాలి: వాహనంలో ఉన్న మరొకరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, వారు మద్యం సేవించకుండా ఉంటే.. వారికి వాహనాన్ని అప్పగించి పంపేయాలి.
పోలీసుల అత్యుత్సాహంపై చురకలు!
చాలా సందర్భాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడం వల్ల వాహనాలు పాడవుతున్నాయని, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఎవరూ లేని పక్షంలో వాహనాన్ని క్షేమంగా పార్క్ చేయించాలే తప్ప, చట్టవిరుద్ధంగా సీజ్ చేయకూడదని జస్టిస్ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
గతంలో ఉన్న రూల్స్ ఏంటి?
నిజానికి తెలంగాణలో ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉంది. గతంలో కూడా హైకోర్టు ఇవే ఆదేశాలు ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో పోలీసులు ఇప్పటికీ వాహనాలను సీజ్ చేస్తూనే ఉన్నారు. తాజా తీర్పుతో పోలీసులు తమ తీరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ పోలీసులు నిబంధనలు అతిక్రమించి బండిని సీజ్ చేస్తే.. వాహనదారులు హైకోర్టు తీర్పును కోట్ చేస్తూ న్యాయం పొందవచ్చు.
ఈ తీర్పు అంటే మందు తాగి బండి నడపమని కాదు.. తాగి దొరికితే చట్టపరమైన జరిమానా కట్టాల్సిందే, కానీ ఆ సాకుతో వాహనాన్ని లాక్కోవడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు చెప్పినట్లు అర్థం చేసుకోవాలి.












Click it and Unblock the Notifications