కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్: వరుస దెబ్బలు.. సచివాలయంపై స్టే పొడగింపు.. మోదీ సర్కారు ఓకే చెప్పిందా?
తెలంగాణలో సచివాలయం కూల్చివేత ప్రక్రియ జఠిలంగా మారుతున్నది. పనులు చేసుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నలిచ్చిన రాష్ట్ర హైకోర్టే.. పలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పనులు నిలిపేయించింది. భవనాల కూల్చివేతపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను మళ్లీ పొడిగిస్తూ బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ప్రస్తావిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు, సచివాలయం కింద నిజాం కాలం నాటి ఖజానా ఉందని, దాని కోసమే కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై దుమారం కొనసాగుతోంది.

కేబినెట్ నిర్ణయాల సమర్పణ..
సచివాలయం కూల్చివేత పనుల్లో సరైన నిబంధనలు పాటించడంలేదంటూ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ ను చీఫ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్నది. కూల్చివేత పనులపై ఇప్పటికే రెండు సార్లు స్టే ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం.. తాజాగా గురువారం వరకు దానిని పొడిగించింది. కూల్చివేతకు సంబంధించి కేబినెట్ నిర్ణయంతోకూడిన కౌంటర్ ను ప్రభుత్వం దాఖలు చేయగా దానిపై వాడీ వేడీ వాదనలు జరిగాయి.

సర్కారు వాదనతో విభేదం..
సచివాలయ భవనాల కూల్చివేతకు ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని, పనుల సమయంలో కొవిడ్ నిబంధనల్ని కూడా పాటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ స్పందిస్తూ.. అసలు కూల్చివేతలకు పర్యావరణ అనుమతులు అవసరమే లేదని, జీహెచ్ఎంసీ అనుమతి మాత్రమే సరిపోతుంది కనుక ఆ మేరకు ఎన్వోసీ పొందామని, చెప్పారు. ప్రభుత్వ వాదనతో విభేదించిన జడ్జిలు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం అనుమతి లభించిందా?
పాత భవంతులను తొలగించి భూమిని చదును చేసేందుకు పర్యావరణ అనుమతి అవసరం లేదని, కొత్త నిర్మాణల కోసం మాత్రమే అది అవసరమని అడ్వొకేట్ జనరల్ చెప్పగా.. కూల్చివేతలకు కూడా పర్యావరణ అనుమతులు కావాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. ఎన్వీరాన్ మెంట్ ప్రోటక్షన్ యాక్ట్ ప్రకారం భవనాల కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని గుర్తుచేసింది. పర్యావరణ అనుమతిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందా? లేదా అనే వివరణతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చే తీర్పులుంటే వాటిని సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు విచారణను గురువారానికి వాయిదా వేసింది. తొలుత కేబినెట్ నిర్ణయాన్ని సమర్పించాలన్న హైకోర్టు.. ఇప్పుడు కేంద్రం వివరణను కూడా అడగటాన్ని బట్టి కూల్చివేతల వ్యవహారం ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి.

రేవంత్ వ్యాఖ్యలపై దుమారం..
132 ఏళ్ల కిందట, నిజాం జమానాలో నిర్మించిన సచివాలయం భవంతులను ప్రభుత్వం రాత్రిరాత్రే హై సెక్యూరిటీ మధ్య కూల్చివేయడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. సచివాలయం కింద నేలమాళిగలు ఉన్నాయని, వాటిలో నిజాం ఖజానా ఉందని, దాని కోసమే కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుమారం రేపాయి. సచివాలయం జీ బ్లాక్ కింద రహస్య నిధులు ఉండొచ్చని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించిందని, 2016లో తొవ్వకాల కోసం అనుమతి కోరగా, ఇదే కేసీఆర్ సర్కారు నిరాకరించిందని, లేఖ రాసిన అధికారిని కూడా అప్పట్లో బదిలీ చేశారన్న ఆయన.. దీనిపై కాంగ్రెస్ పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు.
Recommended Video

కేసీఆర్ సర్కారుకు వరుస దెబ్బలు
కరోనా విజృంభిస్తున్నవేళ సచివాలయం కూల్చివేత పనులకు పూనుకున్న కేసీఆర్ సర్కారుకు ఆ రెండు విషయాల్లోనూ కోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కరోనాపై మంగళవారం నాటి విచారణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి జడ్జిలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ పాలకుల కంటే అధ్వాన్నంగా ఉన్నారని, ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నదని, కరోనా టెస్టులు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆగ్రహించింది. కరోనా ఆస్పత్రుల వివరాలను ప్రజలకు చెప్పాలని ఆదేశించింది. తర్వాతిరోజైన బుధవారం సచివాలయం కూల్చివేతపై జరిగిన విచారణలోనూ పర్యావరణ అనుమతుల అంశంపై కోర్టు.. ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించింది. కేంద్రం వివరణను కూడా పొందుపర్చాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications