నైట్ కర్ఫ్యూ విధిస్తే సరిపోతుందా?: తెలంగాణ సర్కారుపై హైకోర్టు ప్రశ్నల వర్షం, అసంతృప్తి
హైదరాబాద్: కరోనా కట్టడి విషయంలో మరోసారి తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. తెలంగాణలో కరోనా పరిస్థితులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు, చికిత్సలు, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారణ చేపట్టింది.

సెకండ్ వేవ్ వ్యాప్తి తర్వాత మేల్కొంటారా?
ఏప్రిల్ 1 నుంచి 21 వరకు 19.64 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. 16.17 లక్షల ర్యాపిడ్ పరీక్షలు, 3.47 లక్షల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య ఎప్పుడు పెంచుతారని హైకోర్టు ఈ సందర్భంగా సర్కారును ప్రశ్నించింది. సెకండ్ వేవ్ పొంచివుందన్న విషయం తెలిసినా.. ఎందుకు సిద్ధం కాలేదని నిలదీసింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందాక మేల్కొంటారా? అని ప్రశ్నించింది.

నైట్ కర్ఫ్యూ అమలు చేస్తే సరిపోతుందా?
నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారని చెబుతున్నారు.. రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తే సరిపోతుందా? సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలు, పబ్లపై ఆంక్షలేవీ? ఎన్నికల ర్యాలీలపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదు? పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఆంక్షలున్నప్పుడు.. ఎన్నికలు అతీతమా? అని రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. యాదాద్రి భువనగిరి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని, ఆయా జిల్లాల్లో టెస్టులు పెంచాలని ఆదేశించింది. అలాగే వలస కార్మికుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కరోనా నియంత్రణకు ప్రత్యేక కమిటీ వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణలో కరోనా మరణాలు కాకిలెక్కలేనా?
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా మరణాలపై ప్రభుత్వానివి కాకిలెక్కలని ఆరోపణలున్నాయని విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మసనం గుర్తు చేసింది. తెలంగాణ సర్కారు వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 6206 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 29 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,79,494కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,928కి చేరింది. ప్రస్తుతం 52,7264 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 3052 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,24,840కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,22,81,027 కరోనా టెస్టులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications