సర్వే: ప్రశ్నలతో ఇబ్బంది పెడితే ఫోన్లలో బందిస్తారట...!
హైదరాబాద్: రేపు (19వ తేదీ, మంగళవారం) జరగనున్న సమగ్ర సర్వే జరగనున్న విషయం తెలిసిందే. ఈ సర్వే పైన విపక్షాల నుండి కొంత వ్యతిరేకత వచ్చింది. అయితే, ఇంకొంతమంది దీనిని సమర్థిస్తున్నారు. మరోవైపు, సర్వే సమయంలో ఎన్యూమరేటర్లు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు గుప్పిస్తే, అవసరమైన పక్షంలో... కొందరు అందుకు సంబంధించిన దానిని ఆడియో, వీడియో తీసే అవకాశాలు ఉన్నాయట.
సమగ్ర సర్వేను తెలంగాణ టీడీపీ, తెలంగాణ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వంటి పార్టీలతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా కొంత వ్యతిరేకించాయి. ఒక్కోరు ఒక్కో అంశంపై వ్యతిరేకించిన దాఖలాలు ఉన్నాయి. పుట్టిన రోజు ధృవీకరణ పత్రం, ఒక్కరోజులోనే సర్వే చేయడం వంటి పలు అంశాలను విపక్షాలు ప్రశ్నించాయి. అదే సమయంలో కొన్ని పార్టీలు సర్వేను సమర్థించాయి. అయితే, సర్వే తీరును మాత్రమే కొన్ని పార్టీలు తప్పుపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం సర్వే సమయంలో అన్ని వివరాలు ఇవ్వాలని ప్రజలకు సూచించింది. సంక్షేమ పథకాలు తదితర వాటికి బ్యాంకు అకౌంట్ అవసరమనే ఉద్దేశ్యంతోనే ఆ వివరాలు అడుగుతున్నామని, అయితే, ఇవ్వాలో వద్దో వారిష్టమని చెబుతోంది. సర్వే పైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. ఆంధ్రావారిని లక్ష్యంగా పెట్టుకొని ఈ సర్వే జరపడం లేదని చెప్పింది. విపక్షాలు, కొన్ని వర్గాల నుండి సర్వే పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ 19న సర్వే జరగనుంది. హైకోర్టు కూడా దీనికి గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో.. సర్వే సమయంలో ఎన్యూమరేటర్లు తమను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగితే తమ తమ సెల్ఫోన్ల ద్వారా దానిని చిత్రీకరించాలనుకుంటున్నారట. అయితే, అవసరమైతేనే అని చెబుతున్నారట. తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలను చిత్రీకరించనున్నారట. ఎన్యూమరేటర్లు తమను ఏం అడిగారు, ఎలా ఇబ్బంది పెట్టారని చెప్పేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నారట.
సర్వేను వీడియో తీయడం ఏం నేరం కాదు కదా అని కూడా ప్రశ్నిస్తున్నారట. అయితే, ఎన్యూమరేటర్లు ప్రభుత్వం తరఫున సర్వే చేస్తున్నారని, ప్రజల కోసమే ఈ సర్వే చేస్తున్నామని, ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు కోపం ఎందుకనే వారు కూడా లేకపోలేదు. పూర్తి వివరాలు అడిగేది ప్రజలకు మేలు చేసేందుకేననే విషయం అర్థం చేసుకోవాలంటున్నారు.












Click it and Unblock the Notifications