Bheemla Nayak : భీమ్లా నాయక్ పాటపై వివాదం-తెలంగాణ ఐపీఎస్ అభ్యంతరం-ఏమన్నారంటే...
'భీమ్లా నాయక్...' నిన్నటి నుంచి ఈ సినిమా టైటిల్ సాంగ్ మార్మోగిపోతోంది. పాట విడుదలైన 22 గంటల్లో 7 మిలియన్ల పైచిలుకు వ్యూస్తో ప్రస్తుతం యూట్యూబ్లో నంబర్.1 ట్రెండింగ్లో ఉంది. జానపద గాయకుడు,కిన్నెరమెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య పాడిన సాకి మొత్తం పాటకే హైలైట్గా నిలిచింది. మధ్యలో మరో సింగర్ రామ్ మిరియాల గానం కూడా అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటపై తెలంగాణ పోలీసుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుండటం గమనార్హం.
ఎందుకీ అభ్యంతరం...
హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ,ఐపీఎస్ రమేశ్ భీమ్లా నాయక్ పాటలోని లిరిక్స్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా పాటపై స్పందించారు. 'తెలంగాణ పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ. మేము ఎవరి రక్షణ కోసమైతే తాము జీతాలు తీసుకుంటున్నామో.. వారి బొక్కలు తాము విరగ్గొట్టం. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి పోలీసుల ఛరిష్మాను వర్ణించేందుకు ఇంతకుమించిన పదాలు దొరక్కపోవడం ఆశ్చర్యకరం. పోలీసుల సేవల గురించి ఇందులో ఎక్కడా పేర్కొనలేదు.' అని ఐపీఎస్ రమేశ్ పేర్కొన్నారు.
పాటలో ఆ లైన్స్పై అభ్యంతరం...
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్లో... 'చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క', 'ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస', 'కుమ్మడంలో విడి ఒక బ్రాండు తెల్సావీడి దెబ్బతిన్న ప్రతివాడు పాస్టు టెన్సా' అనే లైన్స్ ఉన్నాయి. పోలీస్ పాత్రలో పవన్ వీరత్వం గురించి వర్ణించేందుకు రామజోగయ్య ఈ లైన్స్ వాడినట్లున్నారు. కానీ పోలీసులంటే కుమ్మడం,బొక్కలు విరగ్గొట్టడమే కాదు అని ఐపీఎస్ రమేశ్ అభిప్రాయపడుతున్నారు. పోలీసుల సేవాగుణాన్ని పాటలో పేర్కొనకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. పోలీస్ అధికారి అభ్యంతరంపై భీమ్లా నాయక్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
దర్శనం మొగిలయ్య సాకి హైలైట్....
జానపద గాయకులను,జానపద పాటలను ప్రోత్సహించడంలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారు. గతంలో మాస్టార్జీ వంటి ప్రజా గాయకులతో పవన్ పాటలు రాయించుకున్న సంగతి తెలిసిందే. జానీ సినిమాలో మాస్టార్జీ రాసిన 'నారాజు గాకురా...' పాట అప్పట్లో బిగ్ హిట్. అత్తారింటికి దారేది సినిమాలో జానపద గీతం 'బేట్రాయి సామి దేవుడా...' ఎంతలా పేలిందో తెలిసిందే. తాజాగా దర్శనం మొగిలయ్యతో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సాకి పాడించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంతరించిపోతున్న కిన్నెరమెట్ల వాయిద్య కళకు వెండితెరపై స్థానంతో గొప్ప గౌరవమిచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్
మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచిన చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్కు తెలుగు రీమేక్గా భీమ్లా నాయక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో రానా దగ్గుబాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్యా మీనన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారుఇటీవలే విడుదలైన టీజర్కు అదిరిపోయే స్పందన లభించింది. తాజాగా విడుదలైన పాట యూట్యూబ్ను షేక్ చేస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత దర్శకులు సురేందర్ రెడ్డి,క్రిష్ సినిమాల్లో పవన్ హీరోగా నటించనున్నారు.