మామకు ప్రేమతో: ట్విట్టర్లో మంత్రి హరీశ్, తొలి ట్వీట్ ‘ఖేడ్’ విజయంపైనే
హైదరాబాద్: టీఆర్ఎస్ కీలక నేతగా, రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి తన్నీరు హరీశ్ రావు పార్టీకి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. తాజాగా మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారు.
నారాయణఖేడ్ అంటే 'కాంగ్రెస్ కంచుకోట' అని రాష్ట్ర రాజకీయాల్లో పేరుంది. 65 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అసెంబ్లీ నియోజక వర్గంలో దాదాపు 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు 'కారు' స్పీడుకు ఒక్కసారిగా బద్దలైంది.
నారాయణఖేడ్లో టీఆర్ఎస్ రికార్డు విజయాన్ని నమోదు చేయడంతో మంత్రి హరీశ్ రావు ఇటీవల సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ట్విట్టర్లో ఖాతా ఓపెన్ చేశారు. అంతేకాదు తన తొలి ట్వీట్ను నారాయణఖేడ్ విజయంపైనే పోస్ట్ చేయడం విశేషం.
‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన కానుకగా నారాయణఖేడ్లో టీఆర్ఎస్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రభుత్వ పనితీరును, సంక్షేమ పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారన్నదానికి ఈ ఘన విజయమే నిదర్శనం. రాజకీయంగా, వ్యక్తిగతంగా నాపై ఈ విజయం మరింత బాధ్యత పెంచింది. సిద్దిపేట తరహాలో నారాయణఖేడ్ను అభివృద్ధి చేస్తా'' అని ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నారాయణఖేడ్లో తొలిసారిగా ప్రజలు టీఆర్ఎస్కు భారీ విజయాన్ని అందించారన్నారు. ముందు అన్నట్టుగానే టీఆర్ఎస్ను గెలిపించి సీఎం కేసీఆర్కు ప్రజలు పుట్టినరోజు కానుక అందించారన్నారు.
‘‘అత్యధిక శాతం ఓటింగ్ నమోదైన ఎన్నికలివి. ఏ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా రా నంత మెజారిటీ తొలిసారి టీఆర్ఎస్కు వచ్చింది. గతంలో ఎన్న డూ లేని విధంగా టీడీపీ డిపాజిట్ గల్లంతైంది. కాంగ్రె్సకు ఇంత తక్కువ ఓట్లు గతంలో ఎన్నడూ రాలేదు. ఒక్క చిన్న హింసాత్మక సంఘటన జరగని, ఒక్క ఎన్నికల కేసు నమోదు కాని, ఒక్క పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరగని ఎన్నికలివి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఎన్నికల తర్వాత ఖేడ్ ముఖ చిత్రంలో తప్పక మార్పులు వచ్చేలా కృషి చేస్తా'' అని హరీశ్ అన్నారు.
అత్యంత వెనకబడిన ఖేడ్ అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష తనకుందన్నారు. అది ఒక్క టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. ఆ నమ్మకంతో నే ప్రజలు ఇంత భారీ మెజారిటీ ఇచ్చారన్నారు. ప్రజల పెట్టుకున్న ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేసి వారి మన్ననలను పొందడానికి కృషి చేస్తామన్నారు.
‘కంటి ముందు అభ్యర్థి.. ఇంటి ముందు అభివృద్ధి' అన్న నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించామని, అందుకు తగ్గట్టు భూపాల్రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. ప్రతి గ్రామంలో, తండాలో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించడం సహా అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు.