తెలంగాణ సర్కారుపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు: ప్రౌడ్ మూమెంట్ అంటూ హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఐక్యరాజ్యసమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు దక్కాయి. మాతాశిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థ దేశానికే ఆదర్శమంటూ యునిసెఫ్ ప్రశంసించింది. ఈ వ్యవస్థ దేశానికే దిక్సూచిగా మారిందని అభినందించింది.
తెలంగాణలో అందిస్తున్న ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని యునిసెఫ్ ఇండియా పేర్కొంది. సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని తెలిపింది. ఫర్ ఎవ్రీ చైల్డ్ ఏ హెల్తీ స్టార్ట్ హ్యాష్ట్యాగ్తో హైదరాబాద్లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేస్తూ.. యునిసెఫ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
Proud moment for #Telangana as global organizations recognise the efforts of our government towards maternity care. This is the endorsement of thriving #AarogyaTelangana under the dynamic leadership of #CMKCR garu. https://t.co/WWWdPzZFDk
— Harish Rao Thanneeru (@trsharish) December 30, 2022
మెటర్నిటీ కేర్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవప్రదమైన రీతిలో పనిచేస్తన్నట్లు యునిసెఫ్ పేర్కొంది. పురుడు సమయంలో తల్లులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. పాజిటివ్ బర్త్ ఎక్స్ పీరియన్స్ కలిగే రీతిలో మిడ్ వైఫరీ కోసం శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ప్రశంసించింది. యునిసెఫ్ ప్రశంసలపై తెలంగాణ ఆరోగ్యమంత్రి హరీశ్ రావు స్పందించారు.
యునిసెఫ్ ట్వీట్ను హరీశ్ రావు రీట్వీట్ చేశారు. మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రపంచ సంస్థలు గుర్తించడం తెలంగాణకే గర్వకారణంగా ఉందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అందుకు ఇది ఒక నిదర్శనమని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.