'వ్యక్తిగా, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తప్పుచేశాడు'
హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో నిర్వహించిన ఆర్థిక మంత్రుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించామన్నారు.
తెలంగాణ ఖాతా నుంచి రూ. 1270 కోట్లు అక్రమంగా తీసుకున్నారని, మా ఖాతా నుంచి వసూలు చేసిన డబ్బుని జమ చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా డబ్బు తీసుకోవడం చట్ట విరుద్ధమని జైట్లీకి చెప్పామని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానం బాగుందని అరుణ్జైట్లీ కితాబు ఇచ్చారని అన్నారు. నూతన పారిశ్రామిక విధానం గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
రెండు రాష్ట్రాలు బాగుండాలని, ఇరు రాష్ట్రాల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉండాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి కేటీఆర్ అన్నారు. తాను చేసిన తప్పుడు పనులను రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారని పేర్కొన్నారు.
తాను చేసిన గలీజు పనిని చంద్రబాబు ఏపీ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని, ఓటుకు నోటు కేసు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
సెక్షన్ 8 రాష్ట్రాల అధికారాల్లో చోరబడేదిగా ఉందని, రాజ్యాంగ సవరణ లేకుండా సెక్షన్ 8 చెల్లదని రాజ్యసభలో అరుణ్ జైట్లీ అప్పుడే చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గవర్నర్ మార్పుపై ఆ అంశం కేంద్రానికి సంబంధించినదని, రాష్ట్రాలకు చెందినది కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సెక్షన్-8ను అమలు చేస్తారనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరం చాలా ప్రశాంతంగా ఉందని, వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తప్పిదానికి పాల్పడ్డారని, ఈ దేశంలో చట్టం ఎవరికీ చుట్టం కాదని, చట్టం తన పని తాను చేసుకు పోతుందని కేటీఆర్ అన్నారు.