కరోనా వేళ... కేసీఆర్కు ప్రభుత్వ వైద్యుల షాక్... సమ్మెకు సిద్దమైన జూడాలు,సీనియర్ డాక్టర్లు...
తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వ వైద్యులు షాక్ ఇవ్వబోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టనున్నారు. ఈ నెల 26 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు గాంధీ ఆస్పత్రికి చెందిన జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. మరోవైపు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 26 నుంచి సమ్మె చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
కరోనా విపత్కర పరిస్థితులు వెంటాడుతున్న వేళ వైద్యులు సమ్మెకు దిగితే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైద్యుల డిమాండ్లపై ఎలా స్పందిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
జూనియర్ డాక్టర్ల డిమాండ్లు...
ఈ నెల 26 నుంచి సమ్మె చేపట్టబోతున్నట్లు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ శనివారం(మే 22) గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్కు సమ్మె నోటీసులు అందజేశారు. నిరసనలో భాగంగా ఆదివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని తెలిపారు. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యులకు ప్రాణాపాయం సంభవిస్తే వారి కుటుంబాలకు రూ.50 లక్షలు,నర్సింగ్ సిబ్బందికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలన్న డిమాండుతో సమ్మె నోటీసులు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా 10 శాతం కరోనా అలవెన్సులను వెంటనే అమలుచేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.
టీఎస్ఆర్డీడీఏ సమ్మె నోటీసులు
జూడాలతో పాటు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ (టీఎస్ఆర్డీడీఏ) కూడా సమ్మెకు సిద్దమైంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయని పక్షంలో ఈ నెల 26 నుంచి విధులను బహిష్కరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి తదితర ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు టీఎస్ఆర్డీడీఏ ప్రతినిధులు నోటీసులు అందజేశారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన హామీలను వెంటనే అమలుచేయాలని నోటీసుల ద్వారా డిమాండ్ చేశారు.
ఇంతవరకూ సీఎం నుంచి కబురు లేదు.. : జూడాలు
మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా తమ డిమాండ్లను విన్నవించామని జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఆ సమయంలో డిమాండ్ల పత్రాన్ని సమర్పించడానికి ప్రయత్నించినా సీఎం దాన్ని తీసుకోలేదన్నారు.త్వరలోనే చర్చలకు పిలుస్తామని హామీ ఇచ్చిన సీఎం నుంచి ఇంతవరకూ ఎలాంటి పిలుపు రాలేదన్నారు.
తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... రెండేళ్లుగా తీరిక లేకుండా కోవిడ్ పేషెంట్లకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. తమలో చాలామంది కోవిడ్ బారినపడ్డారని... కొంతమంది వైద్యులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
సీనియర్ డాక్టర్ల డిమాండ్లు...
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1190 సీనియర్ రెసిడెంట్లు విధులు నిర్వహిస్తున్నారన్నారని టీఎస్ఆర్డీడీఏ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగాసీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనం 15 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. వేతనాల విషయంలో కొనసాగుతోన్న జాప్యంపై ఇక ఉపేక్షించేది లేదని చెప్పారు.వైద్యులు, హెల్త్ వర్కర్ కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడితే.. వారికి నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.