తెలంగాణ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఇప్పుడు ఎలా ఉందంటే ?
తెలంగాణలో ఇటీవలే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. అక్కడి పలు కార్యక్రమాల్లో పాల్గొని మెట్పల్లి నుండి తిరిగి మల్కాజిగిరికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్కు ఆరపేట వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూజర్ వాహనానికి ఎదురుగా వచ్చిన మరో కారు వేగంగా ఢీ కొట్టింది. మంత్రి కారు ముందు టైరు ఊడిపోవడంతో పాటు వాహనం స్వల్పంగా దెబ్బతింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్టు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ మంత్రి, డ్రైవర్కి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.

ఇక ఈ ఘటన అనంతరం మంత్రి మరో వాహనంలో వెళ్లిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "లక్ష్మీనరసింహ స్వామి కృప వల్ల నేను మరోసారి ప్రాణాలతో బయటపడ్డాను. ధర్మపురి ప్రజలకు నేను చేస్తున్న సేవలను చూసి దేవుడు నా వెన్నంటి ఉన్నాడు. రెండోసారి నేను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను అని భావోద్వేగంతో తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. ఆ సమయంలోనూ స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు.
ఈ వార్త వెలుగులోకి రాగానే ఆయన అనుచరులు, బంధువులు, పార్టీల నేతలు ఆందోళనకు గురయ్యారు. మంత్రి సురక్షితంగా ఉన్నట్లు తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా అధికార వర్గాలు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications