అందుకే విదేశాల నుంచి వెంటనే వచ్చా: ఐటీ, ఈడీ సోదాలపై మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తన నివాసం, సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలపై స్పందించారు. దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి చెప్పారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఆయన బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు.
దర్యాప్తు సంపూర్ణంగా చేయాలని, నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనని గంగుల కమలాకర్ అన్నారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి ఇంటి తాళాలు తీయని అడిగారన్నారు. తాను ఇంట్లోని ప్రతి లాకర్ ఓపెన్ చేసి చూసుకొమ్మని చెప్పానని తెలిపారు.

ఈ సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు చెప్పాలని మంత్రి కమలాకర్ డిమాండ్ చేశారు. మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి అని తెలిపారు. ఇతర దేశాల నుంచి హవాలా ద్వారా నగదు తెచ్చామా? అనేది ఈడీ, నగదు అక్రమంగా నిల్వ ఉంచామా? అనేది ఐటీ శాఖ చూస్తుందన్నారు. వీటికి సంబంధించి తమ సంస్థల్లో ఎలాంటి అక్రమ జరగలేదన్నారు.
గతంలో కూడా చాలా మంది పలుమార్లు ఈడీ, ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారని, తాము దాన్ని స్వాగతించామన్నారు. తాము పారదర్శకంగా ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం చేస్తున్నామని, ఈ సమయంలో దగ్గరుండి దర్యాప్తునకు సహకరించాలనే వెంటనే వచ్చేశానని మంత్రి కమలాకర్ వివరించారు.
కాగా, హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేశారు. గంగుల కమలాకర్ తోపాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. పంజాగుట్టలోని పీఎస్ఆర్ గ్రానైట్స్, హైదర్ గూడలోని జనప్రియ అపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. మాజీగూడలోగ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలో కూడా సోదాలు చేశారు. కాగా, మంత్రి గంగుల నివాసం, సంస్థల నుంచి పలు కీలక డాక్యుమెంట్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications