మంత్రి గారి కఠిన హృదయం.!కరెంటు బిల్లులు కట్టకపోతే కట్ చేస్తారట.!లబోదిబో మంటున్న జనాలు.!
హైదరాబాద్ : ఇల్లు కాలిపోయి ఒకడేడుస్తుంటే సూరులో ఉన్న గంటసుట్ట కాలిపోయి మరోకడు ఏడ్చినట్టుంది తెలంగాణలో పరిస్ధితి. మూడు నెలల తర్వాత వచ్చిన కరెంటు బిల్లులు చూసి బెదిరిపోతున్న జనాలకు ధైర్యం చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాల్సిన ప్రభుత్వ పెద్దలే కరెంటు బిల్లుల చెల్లింపుల పట్ల కర్కషంగా ప్రకటను గుప్పించడం విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభంతో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద ప్రజలు కూడా లాక్డౌన్ ఆంక్షలకు లోబడే కాలం నెట్టుకొచ్చారు.
మీటర్ రీడింగ్ పడింది.!బుర్ర తిరిగింది.!వేలల్లో బిల్లులు ఎలా కట్టాలి.?నగర వాసుల్లో కొత్త కలవరం.!
కరెంటు బిల్లుల అంశంలో మంత్రిగారి బాద్యతారాహిత్య ప్రకటన.. భగ్గుమంటున్న ప్రజానికం..
ప్రభుత్వ ఆంక్షలు, స్వీయ నియంత్రణ వల్ల గడిచిన మూడు నెలలు కరెంటు బిల్లులు, ఇంటి అద్దె అంశంలో కాస్త ఉపశమనం లభించినప్పటికి ఆతర్వాత వచ్చిన కరెంటు బిల్లులు చూసి నగర వాసులు బెంబేలెత్తి పోతున్నట్టు తెలుస్తోంది. నెలనెల బిల్లు వచ్చినా ఏదో రూపంలో అప్పోసొప్పో చేసి కట్టే వాళ్లం, కాని ప్రస్తుతం ఇంత వేల రూపాయల పెద్ద మొత్తంలో వచ్చిన కరెంటు బిల్లులను చెల్లించేది ఎలారా దేవుడా అంటూ తలలు పట్టుకుంటున్నారు తెలంగాణ వాసులు. ఇదలా ఉండగా ముందే ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ప్రజానికం మీద మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
కల్లోలం రేపుతున్న కరెంటు బిల్లులు.. కట్టలేం బాబోయ్ అంటున్న తెలంగాణ వాసులు..
వచ్చిన కరెంటు బిల్లులే షాక్ ఇస్తుంటే మంత్రిగారి ప్రకటన మరింత గుండెపోటు తెప్పించే విధంగా ఉన్నాయని తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా స్తంభించిపోయిన ఆదాయం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని, ఇంకా పూర్తి స్ధాయిలో బతుకు బండ్లు పట్టాలెక్కకముందే కరెంటు బిల్లుల రూపంలో మోహం వాచిపోయే ముష్టఘాతం ఏంటని ప్రశ్నిస్తున్నారు నగర వాసులు. ప్రజల పట్ల తెలంగాణ ప్రభత్వ వ్యవహారంలో కఠినంగా తయారైందనే చర్చ కూడా జరుగుతోంది.లాక్డౌన్ ఆంక్షల సమయంలో ప్రజల పక్షాన ఆలోచించి ఉన్నత నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేయగానే ప్రజా సమస్యల పట్ల చేతులెత్తేసారా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఛిద్రమైన బతుకులు.. ఇంకా గాడిలో పడకముందే కరెంటు దెబ్బ..
కరోనా కష్టకాలం తెచ్చిన ఆర్దిక సమస్యల భారాన్ని బలవంతంగా ప్రజల మీద రుద్దేందుకు రంగం సిద్దమవుతున్నా సీఎం చంద్రశేఖర్ రావు ఎందుకు పెదవి విప్పడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా కరోనా వైరస్ మహమ్మారి అంశంలో ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరెంటు బిల్లుల అంశంలో మరోసారి తీవ్ర విమర్శలకు గురౌతోంది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన అంశాన్ని మర్చిపోయి, కష్టం వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించకుండా పుండుమీద కారం జల్లినట్టు ప్రవర్తించడం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి అనేక విమర్శలను ఎదుర్కొంటునన్నారు. రాజకీయ ప్రత్యర్థుల మీద వాడివేడి వ్యాఖ్యలు చేస్తే పార్టీలో మైలేజ్ వస్తుందేమోగాని ప్రజలనుద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేస్తే డ్యామేజ్ జరిగే విషయం మంత్రిగారు గ్రహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యామ్నాయం చూపించాలి.. మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు సమంజసం కాదంటున్న జనాలు..
ఒకవైపు ఆదాయం లేదని ఉద్యోగుల జీతాల్లో కోత విదించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వానికే ఆదాయం లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా ఆదాయం ఉంటుందో మంత్రి జగదీష్ రెడ్డి తెలుసుకోలేక పోయారా? విద్యుత్ పై ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే బిల్లులను మాఫీ చేయాలి. మాఫీ చేయడం కుదరక పోతే సర్తి చెప్పాలి లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టాలి. అంతేగాని బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తాం అని బెదిరిస్తున్నారంటే పరిస్థితి ఎంత కఠినంగా తయారయ్యిందో అర్ధమవుతోంది. వెసులుబాటు కల్పించాం కాబట్టి బిల్లుల కట్టాల్సిందే అని మంత్రి గారు హెచ్చరిస్తున్నారు. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయనేది అపోహ మాత్రమేనని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు ప్రజలు. జూన్ బిల్లు కట్టకపోతే కరెంటు పీకేస్తాం అని బహిరంగ వేదికపై చెబుతున్న మంత్రిగారి వైనం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.