హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండున్నర గంటలే!
గత 10 సంవత్సరాలుగా రహదారులపై భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆరోపించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి 9 ఫైల్స్ పై సంతకాలు చేశారు. రానున్న రెండు మూడు సంవత్సరాల్లో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు.
హైదరాబాద్ - విజయవాడ రహదారికే ప్రయారిటీ : సోమవారం భువనగిరి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరేందుకు సోమవారం కలవనున్నట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ ను జాతీయ రహదారిగా గుర్తించాలని కోరతానన్నారు. విజయవాడ - హైదరాబాద్ రహదారిని 6 లైన్లకు, హైదరాబాద్ - కల్వకుర్తి 4 లైన్లకు, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ని పెంచాలని అడగనున్నట్లు చెప్పారు.

6 నెలల్లో పూర్తి :హైదరాబాద్ - విజయవాడ రహదారిలో మల్కాపూర్ వరకు కొంత పని పూర్తయిందని, 6 నెలల్లో దానిని పూర్తి చేస్తామని, హైదరాబాద్ - విజయవాడ రహదారికి అంత్యత ప్రాధాన్యత ఇచ్చి రెండున్నర గంటల్లో విజయవాడ చేరుకునేలా విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఏం చేశారని హరీష్ రావు మాట్లాడుతున్నారని, పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలుండవని, తప్పులుంటే వాటిపైనే చర్యలు తీసుకుంటామన్నారు. గత పది సంవత్సరాలుగా రోడ్లపై శ్రద్ధ పెట్టలేదని, రహదారుల నిర్వహణే తమ మొదటి ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications